కరెన్సీ పతనానికి అడ్డుకట్ట
దేశీయ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న విదేశీ పెట్టుబడిదారుల (ఎఫ్పీఐ) నిష్క్రమణకు, రికార్డు స్థాయిలో పతనమవుతున్న రూపాయి విలువకు బ్రేకులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కొన్ని వర్గాల సెక్యూరిటీల్లో విదేశీ పెట్టుబడిదారులకు పన్ను నిబంధనలను సడలించేందుకు వీలుగా కేంద్ర కేబినెట్ కీలక ఆర్డినెన్స్ను సిఫారసు చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడటంతో త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వెలువడనుంది. పశ్చిమాసియా యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్ల నేపథ్యంలో దేశీయ మార్కెట్లను కాపాడుకునేందుకు ప్రభుత్వం వేసిన వ్యూహాత్మక అడుగు ఇది.
రికార్డు స్థాయిలో నిధుల ఉపసంహరణ
ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయంగా పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 6 శాతం మేర బలహీనపడటం విధాన నిర్ణేతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి తోడు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్పీఐ) జనవరి నుంచి భారతీయ ఈక్విటీల నుంచి రికార్డు స్థాయిలో రూ.2.25 లక్షల కోట్లను ఉపసంహరించుకున్నారు. ఈ భారీ అవుట్ఫ్లోల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి లోనవుతుండటంతో విదేశీ పెట్టుబడులను తిరిగి ఆకర్షించేందుకు పన్ను సడలింపులే ఏకైక మార్గమని ప్రభుత్వం భావించింది.
ప్రధాన డిమాండ్లు
గత కొన్నేళ్లుగా ప్రభుత్వం దీర్ఘకాలిక (ఎల్టీసీజీ), స్వల్పకాలిక (ఎస్టీసీజీ) మూలధన లాభాల పన్నును పెంచడంతో పాటు సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టీటీ)ను కూడా విధించింది. పన్ను నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈ ద్వంద్వ పన్ను విధానం వల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భారతదేశం అంతగా ఆకర్షణీయమైన మార్కెట్గా అనిపించడం లేదు. కేంద్ర బడ్జెట్కు ముందే ఎఫ్పీఐ ప్రతినిధులు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను ఉంచారు.
లిస్టెడ్ సెక్యూరిటీల కోసం మూలధన లాభాల పన్ను విధానాన్ని పూర్తిగా సమీక్షించాలి.
క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ రెండింటినీ కలిపి విధించడాన్ని నిలిపివేయాలి.
ప్రస్తుతం ప్రభుత్వ బాండ్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై విదేశీ పెట్టుబడిదారులు 20 శాతం విత్హోల్డింగ్ పన్ను (టీడీఎస్) చెల్లిస్తున్నారు. (గమనిక.. జులై 1, 2023 వరకు ప్రభుత్వ సెక్యూరిటీలు, రాష్ట్ర అభివృద్ధి రుణాలు, రూపాయి విలువ కలిగిన బాండ్లపై ఈ పన్ను 5 శాతం మాత్రమే ఉండేది. దీనిని తిరిగి సవరించాలని వారు కోరుతున్నారు).
ఎంపీసీ నిర్ణయాలపైనే అందరి దృష్టి
కొన్ని సంస్థల అంచనా ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఆర్డినెన్స్ నిర్ణయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ముందస్తుగా కుదుర్చుకున్న సమన్వయ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. నిన్న ప్రారంభమైన ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు, మార్కెట్లో లిక్విడిటీని పెంచేందుకు సెంట్రల్ బ్యాంక్ కూడా శుక్రవారం కొన్ని కీలక చర్యలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చదవండి: గేదె హెయిర్ స్టైల్కు ఫుల్ క్రేజ్!


