భారత్.. భూటాన్ మధ్య ఒప్పందం: ఎందుకంటే? | India and Bhutan Strengthen Food Safety Cooperation | Sakshi
Sakshi News home page

భారత్.. భూటాన్ మధ్య ఒప్పందం: ఎందుకంటే?

Sep 22 2024 4:15 PM | Updated on Sep 22 2024 4:25 PM

India and Bhutan Strengthen Food Safety Cooperation

దేశ రాజధానిలో జరిగిన గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ సందర్భంగా.. భూటాన్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (BFDA)తో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో భారత్, భూటాన్ మధ్య ఆహార భద్రత అమలుకు సంబంధించిన ఒప్పందం జరిగిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం.. ఆహార భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా ఎఫ్ఎస్ఎస్ఏఐ, బీఎఫ్డీఏ మధ్య సాంకేతిక సహకారం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ఆహార భద్రత, వాణిజ్య సౌలభ్యం విషయంలో భూటాన్‌తో మా భాగస్వామ్యంలో కీలకమైన అభివృద్ధిని సూచిస్తుందని.. ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈఓ జీ కమల వర్ధనరావు పేర్కొన్నారు. బీఎఫ్డీఏతో సన్నిహితంగా పనిచేయడం ద్వారా రెండు దేశాల ప్రయోజనాలకు ఉపయోగపడే బలమైన, సమర్థవంతమైన ఆహార భద్రత ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తున్నామని ఆయన అన్నారు.

ప్రపంచ ఆహార భద్రతా ప్రమాణాలను నెలకొల్పడంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ నాయకత్వాన్ని అంగీకరించామని బీఎఫ్డీఏ డైరెక్టర్ జియెమ్ బిధా (Gyem Bidha) పేర్కొన్నారు. భారత్, భూటాన్ మధ్య సురక్షితమైన ఆహార వాణిజ్యాన్ని సులభతరం చేయడమే ఈ ఒప్పందం లక్ష్యమని అన్నారు.

ఇదీ చదవండి: ఇదే జరిగితే.. 75శాతం యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆపేస్తారు!

ఈ సమావేశానికి ఇరు దేశాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందులో భూటాన్ దేశానికీ చెందిన బీఎఫ్డీఏ డైరెక్టర్ జియెమ్ బిధా, బీఎఫ్డీఏ ఫుడ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ విభాగానికి చెందిన సీనియర్ అధికారులు ఉన్నారు. భారత్ నుంచి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య,  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మాత్రమే కాకుండా ఎఫ్ఎస్ఎస్ఏఐ సీనియర్ అధికారులు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement