దేశంలో నిలిచిన బంగారం, వెండి దిగుమతులు! | Gold, Silver Imports Halted in India Uncertainty Ahead Akshaya Tritiya | Sakshi
Sakshi News home page

దేశంలో నిలిచిన బంగారం, వెండి దిగుమతులు!

Apr 17 2026 11:42 AM | Updated on Apr 17 2026 12:01 PM

Gold, Silver Imports Halted in India Uncertainty Ahead Akshaya Tritiya

దేశీయ బులియన్ మార్కెట్‌లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అధికారిక అనుమతుల్లో జాప్యం కారణంగా భారతీయ బ్యాంకులు విదేశీ సరఫరాదారుల నుంచి బంగారం, వెండి దిగుమతి ఆర్డర్లను నిలిపివేశాయి. ఇప్పటికే దిగుమతి అయిన టన్నుల కొద్దీ విలువైన లోహాలు కస్టమ్స్ క్లియరెన్స్ లేక విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయాయి. ఈ పరిణామం అటు ఆభరణాల రంగాన్ని, ఇటు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

అసలేం జరిగింది?

ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. బంగారం, వెండి దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఉన్న బ్యాంకుల జాబితాను ఇందులో పేర్కొంటుంది. గత ఏప్రిల్ 2025లో జారీ చేసిన ఉత్తర్వుల గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. ఏప్రిల్ ప్రారంభంలోనే కొత్త ఉత్తర్వులు వస్తాయని బ్యాంకులు ఆశించినప్పటికీ ఇప్పటివరకు డీజీఎఫ్‌టీ నుంచి ఎటువంటి స్పందన లేదు. ప్రస్తుతం సుమారు 5 టన్నుల బంగారం, 8 టన్నుల వెండి కస్టమ్స్ వద్ద క్లియరెన్స్ కోసం ఉంది.

‘మునుపటి సరుకులే క్లియర్ కానప్పుడు కొత్త ఆర్డర్లు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు. అందుకే బ్యాంకులు దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేశాయి’ అని ముంబైకి చెందిన ఒక బులియన్ డీలర్ వ్యాఖ్యానించారు.

సరఫరా కొరత - అక్షయ తృతీయపై ప్రభావం?

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా, అతిపెద్ద వెండి కొనుగోలుదారుగా ఉన్న భారత్.. తన అవసరాల కోసం పూర్తిగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతుంది. ప్రస్తుత దిగుమతుల నిలిపివేత వల్ల మార్కెట్‌లో భారీ సరఫరా కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర మెహతా స్పందిస్తూ, ‘త్వరలోనే అక్షయ తృతీయ రాబోతోంది. ఈ సమయంలో దిగుమతులు పునప్రారంభం కాకపోతే మార్కెట్‌లో ప్రీమియంలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి’ అని కోరారు.

వాణిజ్య లోటును తగ్గించే వ్యూహమా?

మరోవైపు, ఈ జాప్యం వెనుక ప్రభుత్వం ఆర్థిక వ్యూహం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆసియా కరెన్సీల్లో ఈ ఏడాది రూపాయి బలహీనంగా ఉంది. బంగారం దిగుమతులు తగ్గితే డాలర్లకు డిమాండ్ తగ్గి, రూపాయి విలువ స్థిరపడే అవకాశం ఉంది. ఇరాన్ వివాదం కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. దీనివల్ల దేశ వాణిజ్య లోటు పెరిగే ప్రమాదం ఉంది. ఈ లోటును సమతుల్యం చేయడానికి విలాస వస్తువులైన బంగారం, వెండి దిగుమతులను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నియంత్రిస్తుండవచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement