1,53,000 దాటిన గోల్డ్
రూ. 5,100 అప్
సిల్వర్ మరో రూ. 20,400 ర్యాలీ
న్యూఢిల్లీ: సర్వత్రా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సురక్షితమైన పెట్టుబడి సాధనాలుగా పరిగణించే పసిడి, వెండి రికార్డు పరుగులు కొనసాగిస్తున్నాయి. మంగళవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పసిడి రేటు కీలకమైన రూ. 1.5 లక్షల మార్కును దాటేసింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు ఏకంగా రూ. 5,100 పెరిగి రూ. 1,53,200కి చేరింది. వెండి ధర కిలోకి రూ. 20,400 పెరిగి మరో కొత్త గరిష్ట స్థాయి రూ. 3,23,000కి ఎగిసింది.
అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాములు) బంగారం ధర తొలిసారిగా 4,700 డాలర్ల మైలురాయిని అధిగమించింది. 66.38 డాలర్లు పెరిగి 4,737.40 డాలర్లకు చేరింది. స్పాట్ సిల్వర్ కూడా కొత్త గరిష్ట స్థాయి 95.88 డాలర్లకి పెరిగింది. దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్లో ఫిబ్రవరి డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ. 6,861 పెరిగి రూ. 1,52,500 వద్ద ట్రేడయ్యింది. అటు వెండి కూడా రూ. 17,723 ఎగిసి రూ. 3,27,998 వద్ద ట్రేడయ్యింది. అటు అంతర్జాతీయంగా కామెక్స్లో పసిడి రేటు ఔన్సుకి (31.1 గ్రాములు) 147.5 డాలర్లు ఎగిసి 4,724.9 డాలర్లు పలికింది. సిల్వర్ ఫ్యూచర్స్ 6.87 డాలర్లు పెరిగి తొలిసారి 95 డాలర్ల మార్కును దాటింది.
అనిశ్చితి, ఉద్రిక్తతలతో ఆజ్యం..
అంతర్జాతీయంగా అనిశ్చితి, అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, రష్యా–ఉక్రెయిన్ వివాదం కొలిక్కి రాకపోవడంలాంటి అంశాల వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పసిడి, వెండి వైపు మళ్లుతున్నారని వెంచురా సంస్థ హెడ్ (కమోడిటీ, సీఆర్ఎం) ఎన్ఎస్ రామస్వామి చెప్పారు.


