వ్యాక్సినేషన్‌ కమిటీ చైర్‌పర్శన్‌గా ఆర్‌ఎస్‌ శర్మ

former TRAI chief RS Sharma to head Vaccine empower committie - Sakshi

కోవిడ్‌-19 వ్యాక్సిన్ల అత్యున్నత కమిటీ బాధ్యతలు

నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌లోనూ సభ్యత్వం

టెలికం నియంత్రణ సంస్థ(ట్రాయ్‌) చీఫ్‌గా గతంలో సేవలు

న్యూఢిల్లీ, సాక్షి: టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు గతంలో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆర్‌ఎస్‌ శర్మను కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కోసం ఏర్పాటు చేస్తున్న అత్యున్నత కమిటీకి చైన్‌పర్శన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ల భారీ పంపిణీ ప్రారంభంకానున్న నేపథ్యంలో శర్మ ఎంపికకు ప్రాధాన్యత ఏర్పడినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మెగా వ్యాక్సిన్‌ కార్యక్రమ పరిపాలనను చూసేందుకు ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల గ్రూప్‌లోనూ శర్మకు సభ్యత్వం లభించింది. నీతి ఆయోగ్‌ సభ్యులు వీకే పాల్‌ అధ్యక్షతన 2020 ఆగస్ట్‌లో నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ను ప్రారంభించిన విషయం విదితమే. 

మే నెలలోనే..
గతేడాది(2020) వేసవిలో దేశీయంగా కోవిడ్‌-19 కేసులు భారీగా పెరిగిన సమయంలో వ్యాక్సిన్ల సరఫరాలపై ప్రభుత్వంతో శర్మ తొలిసారి చర్చించడం గమనార్హం! ఆపై ప్రధాని నరేంద్ర మోడీకి ఒక నివేదికను సైతం అందించారు. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్‌కు ఆధార్‌ వినియోగంపై సూచించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా వ్యాక్సిన్ల పంపిణీ సక్రమంగా జరిగేందుకు వీలుంటుందని తెలియజేశారు. శర్మ అధ్యక్షతన 10 మంది సభ్యులతో అత్యున్నత కమిటీ ఏర్పాటుకానుంది. వ్యాక్సిన్ల డెలివరీలో అవసరమైతే ప్రాధాన్యత కలిగిన వ్యక్తులను ప్యానల్‌లోకి ఆహ్వానించే వీలున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలియజేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top