Elon Musk: ప్రపంచ కుబేరుడు.. పరమ పిసినారి..

Elon Musk: Tesla will not put a manufacturing plant in India - Sakshi

ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. కోట్లకు కోట్ల రూపాయలు అతని బ్యాంక్‌ బ్యాలెన్స్‌లో ఉన్నాయి. అయినా సరే ఆయనకు సంపాదనపై యావ తగ్గడం లేదు. ఇంకా ఇంకా డబ్బు కావాలంటూ అర్రులు చాస్తున్నాడు. ఆయనెవరో కాదు ఈలాన్‌ మస్క్‌. 

ట్విటర్‌ టేకోవర్‌ అంశంలో మైండ్‌ గేమ్‌ ఆడుతున్న ఈలాన్‌మస్క్‌ ఇండియా విషయంలోనూ అదే పంథాను కొనసాగిస్తున్నాడు. టెస్లా మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ పెట్టే విషయంలో పన్నులు తగ్గించాలంటూ గతంలో  విధించిన కండీషన్లపై వెనక్కి తగ్గడం లేదు. 

ఈలాన్‌ ఎప్పుడొస్తున్నావ్‌
ఈలాన్‌ మస్క్‌కి చెందిన ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ స్టార్‌లింక్‌కు ఇండోనేషియా ప్రభుత్వం తాజాగా అనుమతులు జారీ చేసింది. దీంతో ఇండియాకు ఎప్పుడు స్టార్‌ లింక్‌ వస్తుంది అంటూ ప్రణయ్‌ పథోలే అనే ఈలాన్‌మస్క్‌ అభిమాని ప్రశ్నించాడు. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామంటూ ఈలాన్‌ మస్క్‌ జాబిచ్చారు. ఇంతలో మరో యూజర్‌ వచ్చి టెస్లా సంగతేంటని ప్రశ్నించాడు. 

ఇండియాకు రాంరాం
ట్విటర్‌లో టెస్లా అంశంపై ఈలాన్‌ మస్క్‌ స్పందింస్తూ ఇండియాలో ఎక్కడా టెస్లా మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ పెట్టే ఆలోచన లేదంటూ కుండబద్దలు కొట్టాడు. తమ కార్లకు ఇండియాలో పన్ను రాయితీ ఇవ్వని కారణంగా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టే ఉద్దేశం లేదంటూ తేల్చి చెప్పాడు ఈలాన్‌మస్క్‌.

కర్బణ ఉద్ఘారాల పేరు చెప్పి
గతంలో తెలంగాణలో టెస్లా గిగా ఫ్యాక్టరీ పెట్టాలంటూ ఈలాన్‌మస్క్‌ను మంత్రి కేటీఆర్‌ కోరారు. ఆ వెంటనే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలకు రావాలంటూ మస్క్‌కి ఆహ్వానం పలికారు. అయితే అప్పుడు కూడా పన్నుల అంశంపైనే పేచీ పెట్టాడు ఈలాన్‌మస్క్‌. కర్బణ ఉద్ఘారాలు తగ్గిస్తున్నారనే మిష మీద పన్నులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడనే ఆరోపనలు ఉన్నాయి. పైగా మస్క్‌కు రాయితీలు ఇస్తే ఇతర కార్ల తయారీ కంపెనీలపై అది ప్రతికూల ప్రభావం చూపడం గ్యారెంటీ. అందుకే మస్క్‌ ఎంతగా రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్నా కేంద్ర సర్కారు సంయమనంతో ఒకే మాటకు కట్టుబడి ఉంది. 

గిగా ఫ్యాక్టరీలు
ఈలాన్‌ మస్క్‌కి చెందిన టెస్లా కంపెనీ ప్రపంచంలో అతి పెద్ద ఎలక్ట్రిక​ కార్ల తయారీ కంపెనీగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా టెస్లా కార్లను అమ్మే యోచనలో ఉన్నాడు ఈలాన్‌ మస్క్‌. దీంతో అమెరికా, జర్మనీ, చైనాలో గిగా ఫ్యాక్టరీలు నెలకొల్పి భారీ ఎత్తున కార్లను తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలో రెండో అతి పెద్ద మార్కెట్‌గా భారత్‌లోనూ కార్లను అమ్ముతానంటూ ప్రతిపాదనలు తెచ్చారు. 

ఇక్కడ తయారు చేస్తేనే
ఇతర దేశాల్లో తయారైన కార్లను ఇండియాకి దిగుమతి చేసి అమ్మితే.. కారు ఖరీదులో సగం లేదా సమానంగా పన్నులు విధిస్తోంది భారత్‌. అయితే టెస్లా ఎలక్ట్రిక్‌ కార్లు కాలుష్యరహిత కార్లయినందున తమ కార్లకు భారత ప్రభుత్వం పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కోరాడు. దీనికి భారత ప్రభుత్వం ససేమిరా అన్నది. పన్ను మినహాయింపు కావాలంటే ఇండియాలో గిగా ఫ్యాక్టరీ పెట్టాలంటూ కోరింది. ముందుగా పన్ను రాయితీలు ఇస్తే ఆ తర్వాత ఫ్యాక్టరీ పెట్టే విషయం ఆలోచిస్తానంటూ మస్క్‌ బదులిచ్చాడు. ఫ్యాక్టరీ పెడతామంటేనే రాయితీ అంటోంది మన కేంద్ర సర్కారు. దాదాపు ఆర్నెళ్లు దాటినా ఈ విషయంపై రెండు వైపులా ఎవ్వరూ వెనక్కి తగ్గక పోవడంతో ప్రతిష్టంభన నెలకొంది.

చదవండి: కుబేరుల కొట్లాట

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top