Elon Musk: భారీ విరాళం.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రపంచ కుబేరుడు..!

Elon Musk Donated Tesla Shares worth 570 Crore Dollars To Charity - Sakshi

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్​ తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. చిన్నారుల ఆకలి తీర్చేందుకు ప్రపంచ కుబేరులు ముందుకు రావాలని గతంలో ఐక్యరాజ్యసమితి వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బేస్లే ఇచ్చిన పిలుపు మేరకు.. సుమారు 5 మిలియన్​ టెస్లా షేర్లను విరాళంగా ఇచ్చారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌లో దాఖలు చేసిన వివరాల ప్రకారం.. నవంబర్ 19 నుంచి నవంబర్ 29 వరకు తన వాటాలో నుంచి ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు చెందిన 5 మిలియన్లకు పైగా షేర్లను విరాళంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు.

మస్క్​ ఇచ్చిన ఈ విరాళం విలువ సుమారు 5.7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 43 వేల కోట్లు) ఉంటుందని అంచనా. ఇప్పటి వరకు ఇచ్చిన ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద విరాళాల్లో ఈ విరాళం ఒకటిగా నిలవనుంది. అయితే విరాళంగా ఇచ్చిన ఈ మొత్తాన్ని ఏ స్వచ్ఛంద సంస్థకు ఇచ్చారు అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. నియంత్రణా సంస్థలకు ఇచ్చిన సమాచారంలో కూడా ఆ ట్రస్ట్​ వివరాలు పొందుపరచలేదు. మస్క్ వంటి బిలియనీర్లు "ఒక్కసారి తలచుకుంటే" కోట్ల మంది నిరుపేదల ఆకలి బాధలు తీర్చేయొచ్చని ఐక్యరాజ్యసమితి వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బేస్లే గతంలో అన్నారు. 

ప్రపంచంలో సుమారు 4.2 కోట్ల మంది ఆకలి తీర్చేందుకు 6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.45,000 కోట్లు) అవసరమని గతంలో ట్వీట్​ చేశారు.  ఈ విషయంపై స్పందించిన మస్క్​ నిరుపేదల ఆకలి బాధల నిర్మూలనపై మీ ప్రణాళికేంటో చెబితే, నిధులు ఎలా సద్వినియోగం చేస్తారో వెల్లడిస్తే.. 6 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను ఇప్పటికిప్పుడు విక్రయించి, ఐక్యరాజ్యసమితి ఫుడ్‌ ఏజెన్సీకి ఇచ్చేందుకు తాను సిద్ధమేనని గతంలో అన్నారు. అప్పుడు ఇచ్చిన మాట మేరకు మస్క్ తన కంపెనీ షేర్లను విరాళంగా ఇచ్చారు​.

(చదవండి: 10 నిమిషాల్లో రూ.186 కోట్లు సంపాదించిన బిగ్ బుల్)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top