రికార్డుల రియల్‌ ఎస్టేట్‌.. ఇప్పుడంతా టెన్షన్‌! | Dubai Real Estate on Edge Amid Rising Geopolitical Tensions | Sakshi
Sakshi News home page

రికార్డుల రియల్‌ ఎస్టేట్‌.. ఇప్పుడంతా టెన్షన్‌!

Mar 7 2026 1:54 PM | Updated on Mar 7 2026 2:09 PM

Dubai Real Estate on Edge Amid Rising Geopolitical Tensions

స్థిరాస్తి రంగం లావాదేవీలలో అత్యంత ప్రధానమైంది సెంటిమెంట్‌. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఎవరైనా సరే.. వారి భావోద్వేగాలపై ప్రభావం పడిందంటే చాలు తుది నిర్ణయానికి పునరాలోచనలో పడతారు. ఏ దేశ స్థిరాస్తి రంగంలోనైనా ఇదే పరిస్థితి. ప్రస్తుతం పశ్చిమాసియా దేశాలలో యుద్ధం నేపథ్యంలో ప్రధానంగా దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం అనిశ్చితిలో పడింది. గతేడాది దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 2.70 లక్షలకు పైగా స్థిరాస్తి లావాదేవీలు జరిగాయి. వీటి విలువ 917 బిలియన్‌ ఏఈడీ. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ.2,30,872 కోట్లు. దుబాయ్‌ రియల్టీ చరిత్రలో ఇదే అత్యధిక లావాదేవీలు కావడం గమనార్హం. – సాక్షి, సిటీబ్యూరో  

అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు ఇరాన్‌పై మొదలు పెట్టిన యుద్ధం క్రమంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌(యూఏఈ) దేశాలకు విస్తరించింది. దీంతో స్థిరాస్తి పెట్టుబడిదారులు ప్రపంచంలోని అత్యంత డైనమిక్‌ ప్రాపర్టీ మార్కెట్లలో ఒకటైన దుబాయ్‌లో ప్రాంతీయ అస్థిరత దెబ్బతింటుందా అనే సందిగ్ధంలో పడిపోయారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను తాత్కాలికంగా ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

2008 ఆర్థిక సంకోభం,  కరోనా మహమ్మారి కాలంలో దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ షాక్‌కు గురైంది. కాకపోతే విధానపరమైన సంస్కరణలతో ఆయా విపత్కర పరిస్థితుల నుంచి వేగవంతంగా కోలుకుంది. అయితే ఈసారి దుబాయ్‌ కూడా ఎదురుదాడికి దిగడంతో పశ్చిమాసియా దేశాల్లో సురక్షిత ఆర్థిక కేంద్రమైన ఎమిరేట్స్‌లో భౌతిక నష్టం పరిమితమే అయినప్పటికీ.. ప్రపంచ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం తప్పక ఉంటుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారతీయుల పెట్టుబడులు ఎందుకంటే? 
150 దేశాల పెట్టుబడిదారులు యూఏఈ ప్రాపర్టీ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. యూఏఈ జనాభాలో దాదాపు 88–89 శాతం మంది ప్రవాసులు ఉంటారు. దీంతో సహజంగానే ఇక్కడ ప్రాపర్టీ మార్కెట్‌లో వీరిదే హవా.. భౌగోళిక సామీప్యత, డాలర్‌ కంటే దిర్హమ్‌ స్థిరత్వం, ఎక్కువ విలువ, అద్దె రాబడులు అధికంగా ఉండటం వంటి కారణంగా భారతీయులు దుబాయ్‌లో పెట్టుబడులకు మొగ్గు చూపిస్తుంటారు. భారత సంతతికి చెందిన డెవలపర్ల వాటా నిర్మాణ దశలోని ప్రాజెక్ట్‌లలో 8–10 శాతం వరకు ఉంటుంది.

మన ఇన్వెస్ట్‌మెంట్‌ విలువ రూ.2,30,872 కోట్లు.. 
ప్రపంచదేశాలతో పోలిస్తే అత్యధిక అద్దె రాబడి వచ్చేది దుబాయ్‌లోనే.. ఇక్కడ అద్దె వార్షిక ఆదాయం 6–9 శాతం మధ్య ఉంటుంది. భారత్‌ అతిపెద్ద విదేశీ పెట్టుబడుల దేశం దుబాయ్‌. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఇండియన్స్‌ ఆస్తి కొనుగోళ్ల వాటా 20–22 శాతంగా ఉందని అనరాక్‌ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. 2021 నుంచి దుబాయ్‌లో గృహాల ధరలు సుమారు 60–75 శాతం మేర పెరిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దుబాయ్‌లో దాదాపు 2 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయి. వీటి విలువ 538 బిలియన్‌ ఏఈడీ(ఇండియన్‌ కరెన్సీలో రూ.1,34,945 కోట్లు).

ఆర్థిక సంకోభం, కోవిడ్‌ సమయంలో.. 
దుబాయ్‌ ప్రాపర్టీ మార్కెట్‌ గతంలోనూ చేదు అనుభవాలను చవిచూసింది. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దుబాయ్‌లో ప్రాపర్టీల ధరలు 50–60 శాతం మేర క్షీణించాయి. దీని నుంచి కోలుకునేందుకు 6–7 ఏళ్ల కాలం పట్టింది. చమురు ధరల పతనం, అధిక సరఫరా కారణంగా 2014, 2019లలో ఇక్కడ ధరలు దాదాపు 25–30 శాతం మేర తగ్గాయి. ఇక, ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్‌ మహమ్మారి కాలంలో ప్రాపర్టీ మార్కెట్‌లో స్వల్ప అంతరాయం ఏర్పడింది.  

అద్దెలపై ప్రభావం.. 
సాధారణంగా దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రవాసులపై అధికంగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత 
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాపర్టీ ఇన్వెస్టర్లు తాత్కాలికంగా వేచి చూసే ధోరణి అవలంబిస్తారు. ఇలాంటి సెంటిమెంట్‌ ప్రభావం తొలుత నిర్మాణ ప్రారంభ దశలో కొనుగోళ్ల, ఊహాజనిత పెట్టుబడులపై చూపిస్తాయి. ఎందుకంటే ఈ విభాగాలు మార్కెట్‌ సెంటిమెంట్, విశ్వసనీయత మీద ఆధారపడి ఉంటాయి. అలాగే యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాల పర్యాటక పరిశ్రమ దెబ్బతింటుంది. దీంతో పర్యాటక ప్రాంతాల్లోని అద్దెలు, ఆతిథ్య ప్రాపర్టీలు, రిటైల్‌ ఆస్తులపై తాత్కాలిక ప్రభావం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement