24 శాతం వాటా కొనుగోలు
డీల్ విలువ రూ. 12,100 కోట్లు
న్యూఢిల్లీ: కెనడియన్ పెన్షన్ ఫండ్ లా కెస్ (గతంలో సీడీపీక్యూ) దేశీ టెలికం ఇన్ఫ్రా కంపెనీ ఆల్టీయస్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్లో 24 % వాటా కొనుగోలు చేసింది. ఈ వాటాకు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్, బ్రూక్ఫీల్డ్ కలసి రూ. 12,100 కోట్లు(1.76 బిలియన్ కెనడియన్ డాలర్లు) చెల్లించినట్లు ఆల్టీయస్ వెల్లడించింది. దేశీయంగా అతిపెద్ద స్వతంత్ర టెలికం ఇన్ఫ్రాకంపెనీగా నిలుస్తున్న ఆల్టీయస్ దేశవ్యాప్తంగా 2,58,000 పైగా టెలికం టవర్లను నిర్వహిస్తోంది.
వెరసి ఆల్టీయస్లో లా కెస్తోపాటు కలసి బ్రూక్ఫీల్డ్ అతిపెద్ద ఇన్వెస్టర్గా ఆవిర్భవించింది. ఇన్వెస్ట్మెంట్ దిగ్గజాలు జీఐసీ, బ్రిటిష్ కొలంబియా ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్(బీసీఐ)కు చెందిన అనుబంధ కంపెనీలు సైతం వాటా కలిగి ఉన్నాయి. ఇది తమకు అవగాహన ఉన్న రంగమని, దీంతో టెలికం టవర్లు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాలలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు చేపడుతున్నట్లు లా కెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ప్రెసిడెంట్, ఇన్ఫ్రా, సస్టెయినబిలిటీ హెడ్ ఇమాన్యుయేల్ జాక్లట్ పేర్కొన్నారు.


