
వ్యాక్సిన్ ఆవిష్కరణలో గ్లోబల్ లీడర్గా ఉన్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) జీఎస్కే పీఎల్సీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో ప్రధానంగా ఐదేళ్లలోపు పిల్లలను ప్రభావితం చేస్తున్న తీవ్రమైన బ్యాక్టీరియల్ డయేరియా అయిన షిగెల్లోసిస్ను పరిష్కరించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని ఇరు సంస్థలు తెలిపాయి.
డయేరియా వ్యాధికి కారణం అవుతున్న షిగెల్లా అనే బ్యాక్టీరియా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది. దాని తీవ్రత, యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎమ్ఆర్-మందులను తట్టుకునే స్వభావం)పై ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే షిగెల్లాను కట్టడి చేసేందుకు ఇప్పటివరకు లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ లేదు. క్లినికల్ ట్రయల్స్, రెగ్యులేటరీ అనుమతుల ద్వారా ఈ బ్యాక్టీరియాకు విరుగుడుగా ‘ఆల్ట్సాన్ఫ్లెక్స్ 1-2-3’ను అభివృద్ధి చేయడానికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్), జీఎస్కే పీఎల్సీ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.
వ్యాక్సిన్ అభివృద్ధికి జీఎంఎంఏ టెక్నాలజీ
జనరలైజ్డ్ మాడ్యూల్స్ ఫర్ మెంబ్రేన్ యాంటిజెన్స్ (జీఎంఎంఏ) టెక్నాలజీని ఈ వ్యాక్సిన్ కోసం ఉపయోగిస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి బ్యాక్టీరియా బాహ్య పొరలను ఉపయోగించే వినూత్న విధానం. ఈ చౌకైన తయారీ ప్రక్రియ ద్వారా టీకాను మరింత తక్కువ ధరల్లో అందించవచ్చని తెలిపింది.
క్లినికల్ ట్రయల్స్..
యూరప్లో మొదటి దశ ట్రయల్స్ అనుకూలంగా వచ్చాయని భారత్ బయోటెక్ తెలిపింది. ఆఫ్రికాలో రెండో దశ ట్రయల్స్లో 9 నెలల చిన్నారులపై ఎలాంటి భద్రతా సమస్యలు కనిపించలేదని పేర్కొంది. వ్యాక్సిన్ రోగనిరోధక శక్తి లక్ష్యాలను చేరుకున్నట్లు 2024 నుంచి మధ్యంతర ఫలితాలు ధ్రువీకరిస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఫేజ్ 3 ట్రయల్స్ జరుగుతున్నట్లు చెప్పింది. త్వరలో ఈ వ్యాక్సిన్ను వినియోగదారులకు అందిస్తామని ధీమా వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: ‘ఏటా రూ.50 లక్షలు సరిపోతుందా?’ అంటూ పోస్ట్
రోటావైరస్, టైఫాయిడ్, పోలియో, కలరా, సాల్మొనెల్లా వంటి డయేరియా వ్యాధి వ్యాక్సిన్లలో కంపెనీ నాయకత్వాన్ని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా వివరించారు. యాంటీమైక్రోబయల్ నిరోధకతను ఎదుర్కోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పేద జనాభాకు సరసమైన ధరలకు వ్యాక్సిన్ అందించేందుకు కంపెనీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ తయారీకి జీఎస్కేతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ప్రపంచ ఆరోగ్యంపట్ల సంస్థ నిబద్ధతను హైలైట్ చేస్తుందని చెప్పారు.