దేశవ్యాప్తంగా ఏటీఎం సేవలు నగదు కొరత సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMi) ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA)ను హెచ్చరించింది. ఏటీఎంలలో నింపాల్సిన నగదు అందుబాటులో లేకపోవడం వల్ల సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) లబ్ధిదారులు, గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో నగదుపై ఆధారపడే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
అవసరానికి తగ్గ నగదు అందడం లేదు
సీఏటీఎంఐ ఐబీఏకు రాసిన లేఖ ప్రకారం, అనేక రాష్ట్రాల్లో బ్యాంకు శాఖలు, కరెన్సీ చెస్టుల నుంచి ఏటీఎంలలో లోడ్ చేయడానికి అవసరమైన నగదును పొందడంలో సభ్య సంస్థలు నిరంతరం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏటీఎంలకు రూ.94,000 కోట్ల నగదు అవసరమవగా, మార్చిలో కేవలం రూ.61,000 కోట్లు, ఏప్రిల్లో రూ.54,000 కోట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దీంతో అవసరమైన నగదులో వరుసగా 64 శాతం, 57 శాతం మాత్రమే నెరవేరిందని తెలిపింది. ఈ అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ మేనేజ్మెంట్ విభాగం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ‘బిజినెస్ స్టాండర్డ్’ కథనం పేర్కొంది.
నగదు ఉంది.. కానీ ఏటీఎంలకు చేరడం లేదు
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ (Currency in Circulation) రికార్డు స్థాయిలో ఉంది. మే 22 నాటికి చలామణిలో ఉన్న నగదు రూ.42.54 లక్షల కోట్లకు చేరింది. అయినప్పటికీ ఏటీఎంలకు అవసరమైన నగదు సరఫరాలో లోటు కనిపిస్తోంది. దీంతో సమస్య నగదు కొరత కంటే పంపిణీ, లాజిస్టిక్స్, నగదు నిర్వహణ వ్యవస్థల్లోనే ఎక్కువగా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
పెరుగుతున్న ఖర్చులు.. ఆపరేటర్ల ఆందోళన
ఏటీఎం పరిశ్రమ ప్రస్తుతం మరో సవాలును కూడా ఎదుర్కొంటోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ఇంధన ధరలు పెరగడం, పలు రాష్ట్రాల్లో కనీస వేతనాల పెంపు కారణంగా నగదు రవాణా, భద్రత, నిర్వహణ వ్యయాలు గణనీయంగా పెరిగాయి. నగదు రవాణా సంస్థలు, ఏటీఎం రీప్లెనిష్మెంట్ కంపెనీలు బ్యాంకుల నుంచి అధిక ఛార్జీలను కోరుతున్నాయి. ఖర్చులు 15-20 శాతం వరకు పెరిగినట్లు పరిశ్రమ అంచనా వేస్తోంది.
తగ్గుతున్న ఏటీఎం లావాదేవీలు
డిజిటల్ చెల్లింపుల విస్తరణతో ఏటీఎంల వినియోగం క్రమంగా తగ్గుతోంది. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం, 2025లో ఇదే కాలంలో 498.37 మిలియన్లుగా ఉన్న ఏటీఎం లావాదేవీలు 2026 మే నాటికి 446.50 మిలియన్లలకు పడిపోయాయి. ఏడాదిలో సుమారు 10.4 శాతం తగ్గుదల నమోదైంది. అయితే నగదు చలామణి మాత్రం పెరుగుతూనే ఉండటం విశేషం. ఇది ప్రజలు అత్యవసర అవసరాల కోసం నగదును నిల్వ ఉంచుతున్నారనే సంకేతంగా ఎస్బీఐ పరిశోధన నివేదిక పేర్కొంది.
ఫీజుల పెంపు ప్రభావం
గత ఏడాది నుంచి ఉచిత పరిమితిని దాటిన ఏటీఎం లావాదేవీలపై వసూలు చేసే ఛార్జీని రూ.21 నుంచి రూ.23కు పెంచారు. అలాగే ఇంటర్చేంజ్ ఫీజును రూ.17 నుంచి రూ.19కు పెంచినా, పెరిగిన నిర్వహణ ఖర్చులను అది భర్తీ చేయలేకపోతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఏటీఎం ఆపరేటర్ల లాభదాయకతపై ఒత్తిడి పెరుగుతోంది.
ప్రజలపై ప్రభావం ఎంత?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడే పరిస్థితి లేదని బ్యాంకింగ్ వర్గాలు స్పష్టం చేస్తున్నప్పటికీ, నగదు సరఫరా సమస్య కొనసాగితే కొన్ని ప్రాంతాల్లో తరచూ "క్యాష్ అవుట్" పరిస్థితులు కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డీబీటీ లబ్ధిదారులు, రోజువారీ నగదు లావాదేవీలపై ఆధారపడే వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. అందువల్ల నగదు పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, ఏటీఎం రీప్లెనిష్మెంట్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా మార్చడం అత్యవసరంగా మారింది.


