వాణిజ్య వాహన తయారీ హిందుజా గ్రూప్ దిగ్గజం అశోక్ లేలాండ్ తాజాగా గ్రీన్ఫీల్డ్ బ్యాటరీ ప్యాక్ తయారీపై దృష్టి పెట్టింది. ఇందుకు చెన్నై సమీపంలో తయారీ యూనిట్ నెలకొల్పేందుకు రూ. 500 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది.
వెరసి కొత్త బ్యాటరీ ప్యాక్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు వీలుగా పిళ్లైపక్కం(చెన్నై)లో భూమి పూజ నిర్వహించినట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై రూ. 400–500 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఇందుకు 2025 సెప్టెంబర్లోనే హిందుజా గ్రూప్ పెట్టుబడులలో భాగంగా అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో ఇది కీలక ముందడుగుగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ధీరజ్ హిందుజా పేర్కొన్నారు. అంతేకాకుండా దేశీయంగా పటిష్ట ఈవీ ఎకోసిస్టమ్ ఏర్పాటులో తమ కట్టుబాటుకు మరింత మద్దతివ్వనున్నట్లు వివరించారు. తద్వారా దేశీయంగా ఈవీ బ్యాటరీ ప్యాక్ ఉత్పత్తికి వీలు కల్పించనున్నట్లు తెలియజేశారు.


