
తక్కువ ఫీజుతో విదేశాల్లో వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చే దిశగా ఉజ్బెకిస్తాన్కి చెందిన జార్మెడ్ యూనివర్సిటీతో అపోలో మెడ్స్కిల్స్ చేతులు కలిపింది. దీనితో ట్యూషన్ ఫీజు, హాస్టల్, ఆహారం మొదలైనవన్నీ కలిపి రూ.32 లక్షలకి ఆరేళ్ల ఎంబీబీఎస్ కోర్సును చదివే వీలుంటుందని అపోలో మెడ్స్కిల్స్ సీఈవో శ్రీనివాస రావు పులిజాల శుక్రవారమిక్కడ విలేఖరుల సమావేశంలో తెలిపారు.
ఇదీ చదవండి: పోస్టాఫీసుల్లోనూ డిజిటల్ చెల్లింపులు
ఈ భాగస్వామ్య ఒప్పందం కింద మన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణమైన పాఠ్యాంశాలను, ఇంగ్లీషులో బోధించేలా భారతీయ అధ్యాపకులను అపోలో మెడ్స్కిల్స్ సమకూరుస్తుంది. అలాగే అక్కడ విద్యాభ్యాసం తర్వాత, భారత్లో లేదా అమెరికా, బ్రిటన్లో లైసెన్సింగ్ పరీక్షల కోసం కూడా శిక్షణ కల్పిస్తున్నట్లు శ్రీనివాసరావు వివరించారు. డాక్టర్ చదువు కోసం ఏటా లక్ష మంది వరకు విద్యార్థులు విదేశాల బాట పడుతున్న నేపథ్యంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.