ఏంజెల్‌ బ్రోకింగ్‌కు యాంకర్‌ నిధులు

Angel broking raises anchor investments at price rs. 306 - Sakshi

నేటి నుంచి పబ్లిక్‌ ఇష్యూ షురూ

24న ముగింపు- ధరల శ్రేణి రూ. 305-306

రిటైల్‌ ఇన్వెస్టర్లకు కనీస లాట్‌ 49 షేర్లు

ఇష్యూ ద్వారా రూ. 600 కోట్ల సమీకరణ యోచన

యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 180 కోట్ల పెట్టుబడులు

దేశంలో నాలుగో పెద్ద బ్రోకింగ్ సేవల కంపెనీ ఏంజెల్‌ బ్రోకింగ్‌ పబ్లిక్‌ ఇష్యూ నేటి నుంచి ప్రారంభమైంది. గురువారం(24న) ముగియనున్న ఇష్యూలో భాగంగా ఒక్కో షేరుకీ రూ. 305-306 ధరల శ్రేణిని కంపెనీ ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలు రూ. 300 కోట్ల విలువైన వాటాను విక్రయించనున్నాయి. దీనికి అదనంగా మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ఏంజెల్‌ బ్రోకింగ్‌ జారీ చేయనుంది. తద్వారా రూ. 600 కోట్లను సమీకరించాలని ఆశిస్తోంది. ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఐపీవోకు కనీస లాట్‌ 49 షేర్లు. అంటే ఆసక్తి కలిగిన రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 49 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. 

యాంకర్‌ పెట్టుబడులు
ఐపీవోలో భాగంగా ఏంజెల్‌ బ్రోకింగ్‌ తాజాగా యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 180 కోట్లు సమకూర్చుకుంది. షేరుకి రూ. 306 ధరలో 58.8 లక్షల షేర్లను 12 సంస్థలకు కేటాయింంచింది. ఏంజెల్‌ బ్రోకింగ్‌లో ఇన్వెస్ట్‌ చేసిన యాంకర్‌ సంస్థలలో గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఇండియా, మెక్వారీ ఫండ్‌ సొల్యూషన్స్‌, ఇన్వెస్కో ట్రస్టీ, మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ తదితరాలున్నాయి. 

బ్యాక్‌గ్రౌండ్‌..
టెక్నాలజీ ఆధారిత ఫైనాన్షియల్‌ సర్వీసులను ఏంజెల్‌ బ్రోకింగ్‌ అందిస్తోంది. ప్రధానంగా బ్రోకింగ్‌, అడ్వయజరీ, మార్జిన్‌ ఫండింగ్‌, షేర్ల తనఖాపై రుణాలు తదితరాలను క్లయింట్లకు సమకూర్చుతోంది. 7.7 లక్షల మంది యాక్టివ్‌ కస్టమర్లను కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. 6.3 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. క్లయింట్ల రీత్యా దేశంలోనే నాలుగో పెద్ద బ్రోకింగ్‌ సంస్థగా ఏంజెల్‌ నిలుస్తోంది. జూన్‌కల్లా కంపెనీ నెట్‌వర్త్‌ రూ. 639 కోట్లను అధిగమించింది. ఏంజెల్‌ బ్రోకింగ్‌.. ఈ ఏడాది అంటే 2020లో పబ్లిక్‌ ఇష్యూకి వస్తున్న 8వ కంపెనీ కావడం గమనార్హం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top