ఇథనాల్ వినియోగం.. ప్రభుత్వం కొత్త ప్లాన్! | After E20 India Eyes E25 Petrol Government New Ethanol Plan Explained | Sakshi
Sakshi News home page

ఇథనాల్ వినియోగం.. ప్రభుత్వం కొత్త ప్లాన్!

Jul 7 2026 7:25 PM | Updated on Jul 7 2026 8:11 PM

After E20 India Eyes E25 Petrol Government New Ethanol Plan Explained

భారతదేశంలో పెట్రోల్ వినియోగంలో మరో కీలక మార్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ అందుబాటులో ఉండగా, త్వరలో E25 పెట్రోల్ (75 శాతం పెట్రోల్ + 25 శాతం ఇథనాల్) తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ప్రస్తుతం ఈ20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజిన్ పనితీరు, మైలేజీ, ఇంధన వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం పడుతోందో అనే అంశాల గురించి కేంద్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే.. ఆటోమొబైల్ కంపెనీలు, ఇంధన రంగ నిపుణుల నుంచి వచ్చిన సూచనలను కూడా పరిగణలోకి తీసుకుంటోంది. కాబట్టి ఈ25 పెట్రోల్ అమలుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంటుంది.

ఇథనాల్ మిశ్రమాన్ని పెంచే విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు.. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంధనంలో ఇథనాల్ శాతం పెరిగితే వాహనాల పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే దేశంలోని చమురు శుద్ధి సంస్థలు E25 పెట్రోల్ సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి వచ్చిన తర్వాత మాత్రమే మార్కెట్లో E25 ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నాయి. భారత్ ఇప్పటికే ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ కార్యక్రమంలో మంచి పురోగతి సాధించింది.

2030 నాటికి దేశవ్యాప్తంగా E20 అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఆ లక్ష్యం ఐదేళ్ల ముందే సాధ్యమైంది. అయితే ఇప్పుడు అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాల కోసం ప్రభుత్వం కొన్ని కీలక చర్యలు చేపట్టింది. E25 మాత్రమే కాకుండా E22, E27, E30 పెట్రోల్‌కు సంబంధించిన ప్రమాణాలను కూడా ప్రకటించింది. అంతేకాకుండా.. అధిక ఇథనాల్ కలిగిన పెట్రోల్‌కు పన్ను మినహాయింపులు ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో ఇథనాల్ వినియోగాన్ని పెంచేందుకు కూడా తగిన సన్నాహాలు చేస్తోంది.

ఇదీ చదవండి: E20తో మైలేజీ తగ్గొచ్చు.. కానీ..!

అయితే.. E25 పెట్రోల్ ఎప్పుడు పూర్తిస్థాయిలో మార్కెట్లోకి వస్తుందనే విషయంపై ప్రభుత్వం అధికారిక ప్రకటన వెల్లడించలేదు. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూస్తే, భవిష్యత్తులో ఇథనాల్ శాతం మరింత పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement