
న్యూఢిల్లీ: కన్జూమర్ డ్యురబుల్ గూడ్స్, వైమానిక విడిభాగాల కాంట్రాక్ట్ తయారీ కంపెనీ ఏక్వస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా మార్గంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా 20 కోట్ల డాలర్లు(రూ. 1,700 కోట్లు) సమీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా ఈక్విటీ జారీ, ప్రస్తుత ఇన్వెస్టర్ల వాటా విక్రయం ద్వారా కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్కానున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కంపెనీలో ఇప్పటికే అమికస్, అమన్సా, స్టెడ్వ్యూ క్యాపిటల్సహా కాటమారన్, స్పర్ట గ్రూప్ తదితరాలు ఇన్వెస్ట్ చేశాయి. కంపెనీ ఏరోస్పేస్, కన్జూమర్ రంగాలకు ప్రెసిషన్ మ్యాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్ను సమకూర్చుతోంది
ఏక్వస్ భారత్తోపాటు ఫ్రాన్స్, మూఎస్ఏలలో తయారీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. బహుళ పరిశ్రమ విభాగాలలో తన ప్రపంచ కస్టమర్ బేస్కు ఉత్పత్తులను అందిస్తోంది. ఈ సంస్థకు భారత్లోని కర్ణాటకలో మూడు తయారీ క్లస్టర్లు (బెల్గావి, హుబ్బళ్ళి, కొప్పల్) ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం.. టాటా ఎలక్ట్రానిక్స్, మదర్సన్ గ్రూప్, జబిల్తో కలిసి ఏక్వస్ కూడా యాపిల్ ఉత్పత్తుల కోసం మెకానికల్ విడిభాగాలను ఉత్పత్తి చేస్తోంది.