నెలకు లక్షల్లో జీతాలు.. నెలాఖరుకు జేబులు ఖాళీ!

80 Percent Employees Find Wallets Empty Before Payday - Sakshi

ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి రచించిన రిచ్ డాడ్-పూర్ డాడ్ పుస్తకంలో చెప్పినట్లే ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి ఉంది. దేశంలో సుమారు 80 శాతం మంది వైట్‌కాలర్‌ ఉద్యోగుల జీతాలు నెల తిరక్కుండానే అయిపోతున్నాయని ఓ సర్వేలో తేలింది. వీరిలో దాదాపు మూడోవంతు మంది జీతాలు నెలలో సగం రోజులు గడవకుండానే ఖర్చవుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. కన్సల్టింగ్‌ సంస్థ ఈవై, స్టార్టప్‌ రిఫైన్‌లు కలిసి సంయుక్తంగా ఎర్న్‌డ్‌వేజ్‌ యాక్సెస్‌ మోడల్‌(ఒక రకంగా రోజువారీ జీతం విధానం) (EWA)పై సర్వే నిర్వహించారు. ‘ఎర్న్‌డ్‌  వేజ్‌ యాక్సెస్‌ ఇన్‌ ఇండియా: ద ఫైనల్‌ ఫ్రంటియర్‌ ఆఫ్‌ ఎంప్లాయి వెల్‌బీయింగ్‌’ పేరిట ఈ నివేదికను తయారు చేశారు.

ఈ నివేదిక ప్రకారం.. ఉద్యోగుల జీవన వ్యయం నిరంతరం పెరగడం, జీవనశైలి భయాలు, పేలవమైన ఆర్థిక ప్రణాళిక, ఈఎమ్ఐ ఖర్చులు వంటి కారణాలతో ఉద్యోగులు జీతాలు నెల తిరక్కుండానే అయిపోతున్నాయి. జూలై-ఆగస్టు 2021లో 20 నుంచి 60 సంవత్సరాల వయస్సు ఉన్న భారతదేశంలోని 3,010 వేతన ఉద్యోగులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నివేదికను తయారు చేశారు. నెల ప్రారంభంలోనే 14 శాతం మంది, నెల మధ్యలో 20 శాతం, నెలాఖరునాటికి 47 శాతం వారి పూర్తిగా ఖర్చు చేస్తున్నట్లు తేలింది. ఈ ఈడబ్ల్యూఏ సర్వే ప్రకారం కేవలం 38 శాతం మంది మాత్రమే సంతోషంగా ఉన్నారని, వారి ఆర్థికస్థితి అదుపులో ఉన్నట్లు ఈ అధ్యయనం హైలైట్ చేసింది. 

(చదవండి: విమానం ప్రమాదం, తండ్రి - కూతురు ప్రాణాలు కాపాడిన ఐపాడ్‌..!)

ఐటీ ఉద్యోగుల చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు
ఈ ఆర్థిక ఒత్తిడి కేవలం తక్కువ ఆదాయం గల వారికి మాత్రమే పరిమితం కాలేదు. ఎందుకంటే, నెలకు రూ.1,00,000 కంటే ఎక్కువ సంపాదించే వారిలో 59 శాతం మంది తమ జీతాలు నెలాఖరులోగా ఖర్చు అయిపోతున్నాయి.59 శాతం మందికి జీతాలు వచ్చే సమయానికి చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు. వీరికి ఆర్ధిక క్రమశిక్షణ కొరవడినట్లు తేలింది. వీరు ఒక మార్కెట్ చక్రంలో ఇరుకున్నారు. వాస్తవానికి భారత్‌లో అత్యధిక వేతనాలు పొందే ఐటీ సెక్టార్‌లోని ఉద్యోగుల జీతాలను విచ్చల విడిగా ఖర్చు చేస్తున్నారు. దీంతో నెలాఖరులో చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు. ఇక ఈడబ్ల్యూఏ విధానంలో జీతాలు తీసుకోవడానికి చాలా తక్కువ మంది ఉద్యోగులు ఆసక్తి చూపగా.. మిగిలిన వారు మరింత తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఈ సరికొత్త మోడల్‌లో మీరు సంపాదిస్తున్న సమయంలో ఎప్పుడైనా జీతాలను డ్రా చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా పశ్చిమ దేశాల్లో దీనిని అనుసరిస్తున్నారు. 

14 రోజులకు ఒకసారి
యుకెజి ఇండియా, రెఫిన్ వంటి సంస్థలు పాశ్చాత్య దేశాలు స్వీకరించిన నమూనాను భారతదేశంలో పరీక్షిస్తున్నాయి. ఇంకా అనేక ఇతర సంస్థలు ప్రతి 14 రోజులకు ఒకసారి జీతాలను ఉద్యోగులకు చెల్లించేందుకు సిద్దం ఆవుతున్నాయి. ఎఫ్ఎంసిజి, తయారీ, మౌలిక సదుపాయాలు, నిర్మాణం, రియల్ ఎస్టేట్, రిటైల్, రెస్టారెంట్లు, లాజిస్టిక్స్, పర్యాటకం, రవాణా వంటి రంగాలలో ఈడబ్ల్యుఏ విధానాన్ని అనుసరిస్తున్నాయని తేలింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా, ఐటీ, టెలికమ్యూనికేషన్లు కంపెనీలు ఈడబ్ల్యుఏ విధానాన్ని దేశంలో అమలచేసేందుకు ప్రయోగాలు చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 

(చదవండి: ఎలక్ట్రిక్‌ వాహనాలపై క్రేజ్‌ మరి ఇంతగా ఉందా...!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top