పలు ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అందని వేతనాలు
రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు
కొందరికి ప్రతి నెలా 5 నుంచి 20వ తేదీ మధ్య వేతన చెల్లింపులు..
కొందరికి నెలల తరబడి జాప్యం
వేతన బిల్లుల రూపకల్పనలో పలు ప్రభుత్వ విభాగాల నిర్లక్ష్యం
5 లక్షల మంది ఉద్యోగుల్లో సగం మందికి జూన్ వేతనాలు అందలేదని అంచనా
ప్రభుత్వం నుంచి ఉద్యోగాల రెన్యువల్ ఆదేశాలు రాలేదంటున్న కొన్ని శాఖలు
మరోవైపు ఏజెన్సీల నిర్వాకం..మొత్తం మీద ఉద్యోగులకు తప్పని నిరాశ
కార్యాలయాల వద్ద నిరసనలు.. అధికారుల తీరుపై ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: జూలై నెల 5వ తేదీ వచ్చినా పలు ప్రభుత్వ విభాగాల్లోని మెజారిటీ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇంకా వేతనాలు అందలేదు. ఈ నెల ఒకటో తేదీన కొన్ని ప్రభుత్వ శాఖల్లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించినప్పటికీ.. చాలా విభాగాల్లో మాత్రం వేతనాలు అందలేదు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన చెల్లింపులకు సంబంధించిన బిల్లులు రూపొందించకపోవడం, వాటిని సకాలంలో సంబంధిత ట్రెజరీ కార్యాలయాలు, పే అండ్ అకౌంట్స్ విభాగాలకు సమర్పించకపోవడంతో వేతన చెల్లింపులు నిలిచిపోయాయి.
పలు శాఖల ఉద్యోగులకు నిరాశ
రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, తాత్కాలిక ప్రాతిపదికన దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొన్ని ప్రభుత్వ విభాగాల్లో కొన్నేళ్లుగా ప్రతి నెలా 5వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య వేతన చెల్లింపులు జరుగుతున్నాయి. కొన్ని విభాగాల్లో నెలల తరబడి వేతన చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. దీనివల్ల ఉద్యోగులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో.. ఈ అంశాన్ని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న ముఖ్యమంత్రి.. ఇకపై అందరికీ ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. పలు ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నిరాశ తప్పలేదు.
దాదాపు సగం మంది ఉద్యోగులకు 4వ తేదీ సాయంత్రం వరకు వేతనాలు అందలేదని అంచనా. పంచాయతీరాజ్ శాఖ, తెలంగాణ మోడల్ స్కూల్స్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కాకతీయ మెడికల్ కాలేజీ, వరంగల్ ఈఎస్ఐ డిస్పెన్సరీ, అటవీ శాఖ, లైబ్రరీ శాఖ, మైనింగ్ శాఖ, ఎస్ఆర్ఆర్ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, సాంకేతిక విద్యాశాఖ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, బీసీ గురుకులాలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, పలు మున్సిపాలిటీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, విజయా డెయిరీ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు, పోలీస్ శాఖ, భూగర్భ జలవనరుల శాఖ, జలమండలి బిల్ కలెక్టర్లు, అన్ని జిల్లా కలెక్టరేట్లలో పనిచేస్తున్న హౌస్కీపింగ్ సిబ్బంది, చెక్ పేమెంట్ విధానంలో పనిచేస్తున్నవారు, 104 డ్రైవర్లు, ఆపరేటర్లు, పశుసంవర్థక శాఖ, ఈఎస్ఐ నాచారం, మిషన్ భగీరథ, వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు శనివారం సాయంత్రం వరకు వేతనాలు అందలేదు.
సమస్య పరిష్కారం కావడం లేదు
వాటర్బోర్డు, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో (ఎస్టీపీలు) పనిచేస్తున్న వారికి వేతనాలు అందకపోవడంతో ఉన్నతాధికారులకు వినతులు సమర్పించాము. కానీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. ప్రస్తుతం పిల్లల స్కూల్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం కొనుగోలు అవసరాలుంటాయి. నెల వేతనం అందకపోవడంతో పిల్లల సమస్యలను కూడా పరిష్కరించలేకపోతున్నాం.
– మందాల బాలక్రిష్ణారెడ్డి, ఔట్సోర్సింగ్ ఉద్యోగి, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ
కొత్త నిబంధనలు పెడుతున్నారు..
మా మున్సిపల్ కార్పొరేషన్లో పరిధిలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందలేదు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులంతా 15 మంది చొప్పున ఒక గ్రూప్గా ఏర్పాటు చేసుకోవాలని, ఆ గ్రూప్ రిజి్రస్టేషన్ చేసుకున్న తర్వాత కమిషనర్కు గ్రూప్ పేర్లు ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. ఆ వివరాలు సమర్పించిన తర్వాతే జీతాలు ఇస్తారంట. ఈ నిబంధనలేమిటో మాకు అర్థం కావడం లేదు. కమిషనర్ స్పందించడం లేదు. జీతాలు సకాలంలో ఇవ్వాలని కోరుతున్నాం.
– కొట్టె సహదేవ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
నాలుగు నెలలుగా వేతనాల్లేవు..
ఈ–పంచాయతీ ఆపరేటర్లకు నాలుగు నెలలుగా వేతనాలు అందలేదు. దీంతో కుటుంబ నిర్వహణ అత్యంత భారంగా మారుతోంది. అప్పులు చేసి కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి ఉంది. సకాలంలో వేతనాలు చెల్లించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం కూడా అందించాం. కానీ ఇప్పటివరకు మా సమస్యకు పరిష్కారం దొరక లేదు. ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా శాఖల వారీగా ఉద్యోగుల ఆధార్ వివరాలు కూడా సమర్పించాం.
అధికారుల వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు
వేతనాలను ఒకటో తేదీన చెల్లించాలని సీఎం చెబుతున్నప్పటికీ కిందిస్థాయిలో అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారి వైఖరి వల్లే వేతనాలు అందడం లేదు. దీంతో లక్షలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అలాంటి అధికారులపై సీఎం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి. వారి వైఖరితో ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తోంది.
– పులి లక్ష్మయ్య, చైర్మన్, తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ
ప్రభుత్వ ప్రకటనతో గందరగోళం
ఈనెల ఒకటో తేదీన అన్ని శాఖల్లోని కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్, పార్ట్ టైమ్ ఉద్యోగులందరికీ వేతనాలు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల ఒకటో తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రకటన ఇవ్వడం తీవ్ర గందరగోళానికి దారితీసింది. శనివారం సాయంత్రం 4 గంటల వరకు చాలామంది ఉద్యోగులకు వేతనాలు అందకపోవడంతో కార్యాలయాల వద్ద నిరసనలకు దిగారు. సీఎం ఆదేశాలనూ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై ఎవరేమంటున్నారు..?
⇒ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం నుంచి సరీ్వసు రెన్యువల్ ఆదేశాలు లేకపోవడంతో వారి వేతన బిల్లులు పంపలేదని కొన్ని ప్రభుత్వ శాఖలు చెబుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే రెన్యువల్ ప్రతిపాదనలు సమర్పించినప్పటికీ.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని, దీంతో నాటి నుంచి వారికి వేతన బిల్లులు చేయలేదని చెప్పుకొస్తున్నాయి.
⇒ కొన్ని ప్రభుత్వ శాఖలు వేతన నిధులను ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి పంపుతున్నామని, అక్కడి నుంచి వారికి వేతనాలు చెల్లిస్తారని చెబుతున్నాయి. నిజంగానే కొన్నిచోట్ల ఏజెన్సీల నిర్వాకం వల్ల వేతన చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. ్ళ వేతన బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ చేసినట్లు ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ విభాగం అధికారులు చెబుతున్నారు.


