ఐటీ ఉద్యోగుల గుండెల్లో గుబులు..లేఆఫ్స్‌ స్పీడు పెంచిన టెక్ కంపెనీలు! | 20,000 Sacked From 85 Tech Firms In January | Sakshi
Sakshi News home page

ఐటీ ఉద్యోగుల గుండెల్లో గుబులు.. తొలగింపుల్లో స్పీడు పెంచిన టెక్ కంపెనీలు!

Jan 27 2024 10:50 AM | Updated on Jan 27 2024 12:58 PM

20,000 Sacked From 85 Tech Firms In January - Sakshi

ప్రపంచ దేశాల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. జనవరి ప్రారంభం నుంచి నిన్న మొన్నటి వరకు 85 టెక్‌ కంపెనీలు 20 వేల మంది ఉద్యోగుల్ని తొలగించాయి.

లేఆఫ్స్.ఎఫ్‌ఐ నివేదిక ప్రకారం గత ఏడాది మార్చిలో టెక్‌ కంపెనీలు అత్యధికంగా 38 వేల మందికి ఉద్వాసన పలికాయి. ఆ తర్వాత మళ్లీ ఈ జనవరిలో తొలగింపులు అత్యధికంగా ఉండటం విశేషం. అయితే, రానున్న రోజుల్లో టెక్నాలజీ కంపెనీలు మరింత మందిపై వేటు వేసే అవకాశం ఉందంటూ వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. 


టెక్నాలజీ సంస్థ శాప్ ఈ వారం 8,000 మంది, మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ విభాగంలో 1,900 మంది, ఫిన్‌టెక్‌ స్టార్టప్ బ్రెక్స్ 20 శాతం సిబ్బందిని, ఈబే 1,000 మంది, సేల్స్‌ ఫోర్స్‌ సుమారు 700 మందిని ఇంటికి సాగనంపింది. 


దేశీయ ఈకామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ తన సిబ్బందిని 5-7 శాతం తగ్గించే పనిలో పడగా.. జొమాటోకు చెందిన క్యూర్‌ఫిట్‌ పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా 120 మంది ఉద్యోగులకు ఉ‍ద్వాసన పలికింది. స్విగ్గీ తన ఐపీఓకు ముందే ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు అందజేయనుంది.



ఈ నెల ప్రారంభంలో గ్లోబల్‌గా గూగుల్‌లో పనిచేస్తున్న వందల ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ధృవీకరించింది. అమెజాన్ తన ప్రైమ్ వీడియో, ఎంజీఎం స్టూడియోస్, ట్విచ్, ఆడిబుల్ విభాగాలలో వందలాది ఉద్యోగాలు ఉపాధి కోల్పోయారు. యూనిటీ తన సిబ్బందిలో 25శాతం మందిని, గేమర్లు ఉపయోగించే ప్రసిద్ధ మెసేజింగ్ సేవను అందించే డిస్కార్డ్ తన ఉద్యోగులలో 17శాతం మందిని ఫైర్‌ చేస్తున్నట్లు తెలిపింది.

ఈ ఉద్యోగుల తొలగింపులు రానన్ను రోజుల్లో భారీగా ఉంటాయని సమాచారం. టెక్‌ కంపెనీలు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఏఐని వినియోగిస్తున్నాయని, ఫలితంగా వర్క్‌ ఫోర్స్‌ మరింత తగ్గించుకునేందుకు ఏమాత్రం వెనుకాడబోవని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.. 

Advertisement
 
Advertisement
Advertisement