
అపార్ట్మెంట్ మెయింటెనెన్స్పై జీఎస్టీకి సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. నెలవారీ మెయింటెనెన్స్పై జీఎస్టీ వర్తింపునకు సంబంధించి అపార్ట్మెంట్ యజమానులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (ఆర్డబ్ల్యూఏ)ల్లో నెలకొన్న అయోమయాన్ని తొలగించేందుకు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రయత్నించింది.
జీఎస్టీ విధింపుపై అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లలోని నివాసితుల్లో నెలకొన్న అయోమయంపై వార్తా కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రెస్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ విభాగానికి చెందిన డైరెక్టర్ జనరల్ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్డబ్ల్యూఏ మొత్తం టర్నోవర్ రూ.20 లక్షలు దాటకుండా అదే సమయంలో ఒక్కో సభ్యుడి మెయింటెనెన్స్ ఛార్జీల మొత్తం నెలకు రూ.7,500 దాటినా కూడా జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఇలా అయితేనే జీఎస్టీ
రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లలోని ఒక్కో సభ్యుడు చెల్లించే నెలవారీ మెయింటెన్స్ రూ.7,500 కంటే ఎక్కువ ఉండి ఆ అసోసియేషన్ వసూలు చేసే మెయింటెన్స్ మొత్తం కూడా సంవత్సరానికి రూ .20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఆర్డబ్ల్యూఏ తన సభ్యుల నుండి వసూలు చేసే నెలవారీ సబ్స్క్రిప్షన్ లేదా కంట్రిబ్యూషన్పై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఇక హౌసింగ్ సొసైటీ లేదా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో రెండు లేదా అంతకంటే ఎక్కువ రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లు కలిగి ఉన్నవారికి తమ ప్రతి రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ కు నెలకు రూ.7,500 చొప్పున పరిమితిని వేర్వేరుగా వర్తింపజేయాలని స్పష్టం చేసింది. అంటే ఒక్కో సభ్యుడికి నెలకు రూ.7,500 దాటితే మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. ఉదాహరణకు మెయింటెనెన్స్ ఛార్జీలు ఒక్కో సభ్యుడికి నెలకు రూ.9,000 అయితే రూ.1,500 వ్యత్యాసంపై కాకుండా మొత్తం రూ.9,000పై 18 శాతం జీఎస్టీ చెల్లించాలి.
ఆర్డబ్ల్యూఏలు, హౌసింగ్ సొసైటీలకు ప్రయోజనం చేకూర్చడానికి 2018 జనవరి 18న జీఎస్టీ కౌన్సిల్ తన 25వ సమావేశంలో అపార్ట్మెంట్ మెయింటెనెన్స్పై జీఎస్టీ మినహాయింపు పరిమితిని రూ .5,000 నుండి రూ .7,500 కు పెంచింది.