breaking news
apartment maintenance
-
‘అపార్ట్మెంట్ కొన్నాను.. చింతిస్తున్నాను’
సొంత ఇల్లు అనేది సగటు మధ్యతరగతి భారతీయుడి జీవితకాల కల. కానీ, సరైన ఆర్థిక ప్రణాళిక లేకుండా మారుతున్న ఆదాయ వనరులను అంచనా వేయడంలో పొరపాటుపడితే ఆ కల కాస్తా జీవితాంతం వెంటాడే పీడకలగా ఎలా మారుతుందో వివరించే ఒక తాజా ఉదాహరణ సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ రెడ్డిట్లోని ‘ఆర్/పర్సనల్ ఫైనాన్స్ ఇండియా’ హ్యాండిల్ ద్వారా ఒక వ్యక్తి పంచుకున్న తన అనుభవం నేటి యువతరం ఆలోచింపజేసేదిలా ఉంది. ‘ఒక అపార్ట్మెంట్ కొన్నాను.. ఇప్పుడు చింతిస్తున్నాను’ అనే శీర్షికతో అతను పెట్టిన పోస్ట్ రియల్ ఎస్టేట్ మోజులో పడి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వేలాది మంది ఐటీ, కార్పొరేట్ ఉద్యోగుల స్థితికి అద్దం పడుతోంది.రూ.25 లక్షల జీతం.. రూ.1.5 కోట్ల ఫ్లాట్!ఆ వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు ఏడాది క్రితం అతను రూ.1.5 కోట్ల విలువైన ఒక అపార్ట్మెంట్ను కొనుగోలు చేశాడు. 2024లో అతని వార్షిక ఆదాయం దాదాపు రూ.25 లక్షలు. ఆ ధీమాతోనే అతను అంత పెద్ద మొత్తానికి హోమ్లోన్ తీసుకున్నాడు. అనుకున్నట్లుగానే 2025లో అతని ఆదాయం రూ.32 లక్షలకు పెరిగింది. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.ఆ వ్యక్తి వేతన నిర్మాణం స్థిరంగా లేదు. అది పూర్తిగా కమీషన్లపై ఆధారపడి ఉంది. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల అతని వ్యాపారం ఒక్కసారిగా దెబ్బతింది. ఫలితంగా అతని నెలవారీ ఆదాయం గణనీయంగా పడిపోయింది.ప్రస్తుత పరిస్థితి‘ఇప్పుడు నా చేతికి వచ్చే జీతం కేవలం హోమ్ లోన్ ఈఎంఐ (ఈఎంఐ), ప్రాథమిక ఖర్చులకు మాత్రమే సరిపోతోంది. నిలదొక్కుకోవడానికి పార్ట్ టైమ్ జాబ్ వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు స్థిరాస్తి కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసి ఉంటే బాగుండేది’ అని ఆ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.ఊహించని ఖర్చులురుణ భారం ఒకవైపు వేధిస్తుంటే ఆస్తి కొనుగోలు తర్వాత వచ్చే అదనపు ఖర్చులు అతనిని కోలుకోలేని దెబ్బ తీశాయి. అపార్ట్మెంట్ సొసైటీ మెయింటెనెన్స్, ఇతర రిపేర్ల కోసం ఏకంగా రూ.2.5 లక్షలు ఖర్చయింది. ఇంట్లో తలెత్తిన ప్లంబింగ్ లోపాల వల్ల మరో రూ.50,000 అదనపు భారం పడింది. ఇవన్నీ భరిస్తూ రావడం వల్ల అతని వద్ద ఉన్న లిక్విడ్ ఎమర్జెన్సీ ఫండ్ రూ.5 లక్షలకు పడిపోయింది.మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్ రూపంలో మరో రూ.10 లక్షల పెట్టుబడులు ఉన్నప్పటికీ అత్యంత క్లిష్ట పరిస్థితి వస్తే తప్ప వాటిని విక్రయించడానికి అతను ఇష్టపడటం లేదు. ఫ్లాట్ కొన్న వెంటనే దాన్ని రీసేల్ చేయడం కష్టమని, ఈ ఊబి నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదంటూ తోటి నెటిజన్లను సలహా కోరాడు.నెటిజన్ల రియాక్షన్‘జరిగిందేదో జరిగింది. ఒకవేళ మీ వ్యాపారం బాగా నడిచి ఉంటే మీరు ఇలా ఆలోచించేవారు కాదు. ఇది కూడా గడిచిపోతుంది. ధైర్యంగా ఉండండి’ అని ఒకరు భరోసా ఇచ్చారు. ‘నష్టాన్ని తగ్గించుకోవాలంటే వెంటనే ఆస్తిని విక్రయించండి. రీసేల్ మార్కెట్లో అపార్ట్మెంట్ అమ్మడం కష్టమే. బ్రేక్-ఈవెన్ (పెట్టిన పెట్టుబడి వస్తే చాలు) స్థాయికి వచ్చినా సరే నష్టాన్ని భరించి ఆస్తిని వదిలించుకుని అప్పు తీర్చండి’ అని మెజారిటీ నెటిజన్లు సలహా ఇచ్చారు.గుర్తుంచుకోవాల్సిన అంశాలు..మీ నెలవారీ నికర ఆదాయంలో హోమ్ లోన్ ఈఎంఐ ఎప్పుడూ 15% నుంచి 20% మించకూడదు. (ఇక్కడ బాధితుడు తన గరిష్ట ఆదాయాన్ని బట్టి లోన్ తీసుకుని ఇరుక్కుపోయాడు.వేరియబుల్ లేదా కమీషన్ ఆధారిత ఆదాయం ఉన్నవారు స్థిరమైన ఉద్యోగుల కంటే తక్కువ అప్పు తీసుకోవడం శ్రేయస్కరం.ఇల్లు కొనడమంటే కేవలం రిజిస్ట్రేషన్ ఖర్చే కాదు.. మెయింటెనెన్స్, ఇంటీరియర్, రిపేర్లు వంటి అదనపు ఖర్చుల కోసం కనీసం 5% నిధిని ముందే దాచుకోవాలి.సొంతింటి కల సాకారం చేసుకోవడం తప్పు కాదు కానీ అది మీ ప్రస్తుత ఆర్థిక స్వేచ్ఛను, మనశ్శాంతిని హరించేలా ఉండకూడదు. -
అపార్ట్మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం.. ఊపిరాడక పలువురు దుర్మరణం
బ్రస్సెల్స్: యూరప్ దేశమైన బెల్జియంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 200 మంది నివాసముంటున్న ఒక అపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. బెల్జియం మీడియా కథనాలు ప్రకారం.. బెల్జియం ఉత్తర ప్రాంతంలోని ప్రముఖ నగరమైన యాంట్వెర్స్లోని లింకెరూవర్ అనే నివాస ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం (జూలై 1) ఉదయం స్థానిక కాలమానం ప్రకారం సుమారు 9:53 గంటలకు అగ్నిప్రమాదంపై ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందింది. 10 అంతస్తుల భవనంలో సుమారు 200 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. అపార్ట్మెంట్ లోని 8వ అంతస్తులో మొదట భయంకరమైన మంటలు ప్రారంభమయ్యాయి. అది క్షణాల్లోనే పై అంతస్తులకు కూడా వ్యాపించింది. ఈ ప్రమాదంలో కనీసం ఐదుగురు మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. ఎంతోమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.మంటలు చెలరేగిన వెంటనే బిల్డింగ్ కారిడార్లలో దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. దాంతో మెట్ల గుండా కిందకు రాలేక, లోపలే చిక్కుకుపోయి ఊపిరాడక కొందరు మరణించారు. ప్రాణభయంతో కొందరు నివాసితులు కిటికీలు, బాల్కనీల నుండి బయటకు వచ్చి కాపాడాలంటూ కేకలు వేశారు. తీవ్ర భయాందోళనల మధ్య కొందరు అపార్ట్మెంట్పై నుండి కిందికి దూకి ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. మరికొందరు పక్క రూముల బాల్కనీల ద్వారా తప్పించుకున్నారు.సమాచారం అందిన వెంటనే వేర్వేరు జిల్లాల నుండి భారీగా ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది స్పెషల్ లాడర్స్ సాయంతో బాల్కనీల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా కిందకు దించారు. క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో స్థానిక ఆసుపత్రులు అలర్ట్ అయ్యాయి. బెల్జియం ప్రభుత్వం అక్కడ 'మెడికల్ ఎమర్జెన్సీ ప్లాన్' యాక్టివేట్ చేసింది. బిల్డింగ్ లోపల ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అని వెతకడానికి ప్రత్యేక రెస్క్యూ టీమ్లతో పాటు స్పెషలైజ్డ్ డ్రోన్ యూనిట్లను కూడా రంగంలోకి దించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్ముకోవడంతో, స్థానిక ప్రజలెవ్వరూ కిటికీలు, తలుపులు తెరవద్దని, వెంటిలేషన్ సిస్టమ్స్ ఆఫ్ చేయాలని పోలీసులు హెచ్చరించారు. బెల్జియం ప్రధాన మంత్రి బార్ట్ డి వెవర్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు తన సానుభూతిని ప్రకటించారు. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న రెస్క్యూ సిబ్బందిని అభినందించారు. మంటలు ఎలా అంటుకున్నాయనే దానికి సంబంధించిన ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు, అధికారులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు. -
భవిష్యత్తు అగమ్య గోచరం
హాంకాంగ్: హాంకాంగ్లోని అపార్టుమెంట్ సముదాయంలో బుధవారం సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం 128 మందిని బలి తీసుకుంది. మరో 200 మంది వరకు జాడ తెలియడం లేదు. హాంకాంగ్లోని మొత్తం 75 లక్షల జనాభాకు గాను ప్రమాదం జరిగిన శివారు టై పొ టౌన్లోనే 3 లక్షల మంది వరకు నివసిస్తున్నారు. 1948 తర్వాత హాంకాంగ్లో చోటుచేసుకున్న అతిపెద్ద అగ్ని ప్రమాదమిది. 1980ల్లో నిర్మించిన వాంగ్ ఫుక్ కోర్టు అపార్టుమెంట్ సముదాయంలో 4,600 మంది ఉన్నట్లు అంచనా. తాజా విషాద ఘటనలో 32 అంతస్తులున్న ఈ కాంప్లెక్స్లో పైఫ్లోర్లలో ఉన్న వారిపై ఎక్కువ ప్రభావం పడింది. మొత్తం 8 అపార్టుమెంట్లకుగాను ఏడు అపార్టుమెంట్లలో దాదాపు 40 గంటలపాటు మంటలు మండుతూనే ఉన్నాయి. విలియం లి కుటుంబం సురక్షితంసెప్టెంబర్ నెలలో తమ అపార్టుమెంట్లోని 29వ ఫ్లోర్ నుంచి రెండో ఫ్లోర్కు మారిన విలియం లి కథ సుఖాంతమనే చెప్పాలి. ఎందుకంటే, ఈ ప్రమాదం నుంచి ఆయన త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన కుటుంబంలోని మిగతా ముగ్గురూ ఆ సమయంలో వేర్వేరు పనులపై బయటే ఉన్నారు. విలియం లి మాత్రం భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందంటున్నారు. పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న అపార్టుమెంట్లోకి తిరిగి వెళ్లడం అసాధ్యం, మరి ప్రభుత్వం తమను ఎలా ఆదుకుంటుందన్న ఆలోచన ఆ కుటుంబాన్ని వెంటాడుతోంది. ప్రమాదం జరిగిన రోజు ఏమైందంటే.. ఆ రోజు సాయంత్రం విలియం లికి సెలవు. బయటకు వెళ్లాలని అనుకుంటుండగా ఎన్నడూ లేంది సాయంత్రం 3 గంటలప్పుడు భార్య నుంచి ఫోన్ వచ్చింది. తమ అపార్టుమెంట్ను మంటలు చుట్టుముట్టాయని ఓ స్నేహితురాలు చెబితే ఫోన్ చేశానంది. లి నమ్మలేదు. అంతా బాగానే ఉంది. పొగ లేదు, మంటలూ లేవు ప్రమాదం లేదంటూ బదులిచ్చారు. దాదాపు 8 నిమిషాల తర్వాత ఆయన డోర్ తెరిచి చూశారో లేదో దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. అంతా నల్లగా కనిపించింది. అప్పుడు ఆయన ప్రమాదం శంకించారు. హాల్లోకి వెళ్లి చూశారు. పొగ తీవ్రతకు తాళ లేక తిరిగి తన ఫ్లాట్లోకి వచ్చేశారు. ఇక తనకు మృత్యు ఘడియలు దగ్గర పడినట్లేననుకున్నారు. ఆ తర్వాత కారిడార్ గుండా వెళ్లేందుకు యత్నించారు. అక్కడ ఇద్దరు వృద్ధులున్నారు. ఈలోగా ఫైర్ ఫైటర్లు నిచ్చెన అందించడంతో ముందుగా ఇద్దరు వృద్ధులు కిందికి దిగేందుకు సాయం చేశారు. ఆ తర్వాత ఫైర్ ఫైటర్లు పంపిన నిచ్చెనపైకి ఎక్కారు. కిందికి దిగేలోపు మంటలను ఆయనను దహించి వేయకుండా నీళ్లు చిమ్ముతూనే ఉన్నారు. ఎలాగోలా కిందికి చేరుకున్న లి సజీవంగా బయటపడినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అక్కడే తన కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న భార్య, కూతురు, కుమారుడు కనిపించారు. అప్పటికి సాయంత్రం 5 గంటలైంది. ‘మాలాంటి వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న హాంకాంగ్ ప్రజలకు కృతజ్ఞతలు’అని ఈ కుటుంబం అంటోంది.మా భవిష్యత్తు ఎలా ఉంటుందో..?ప్రమాదం జరిగిన రోజు ఉదయం ఉద్యోగానికి వెళ్లిన 70 ఏళ్ల చాన్ తాముండే వాంగ్ ఫుక్ కోర్టు కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు. భారీగా వ్యాపిస్తున్న మంటలను దూరం నుంచి చూసి షాకయ్యారు. అలా చూస్తూ ఉండటం మినహా చేయగలిగిందేమీ లేకుండాపోయింది. ఇలాంటి ప్రమాదాన్ని జీవితంలో ఎన్నడూ చూడలేదని ఆమె తెలిపారు. అదృష్టవశాత్తూ ఆమె భర్త ఐఎన్ కాంగ్ ఆ సమయంలో ఇంట్లో లేరు. చాన్, కాంగ్ వేర్వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తుంటారు. దాదాపు పదేళ్లుగా ఉంటున్న ఆ ఇల్లు ఇప్పుడు నివాస యోగ్యంగా ఏమాత్రం లేదు. ఇప్పుడిక ఏం చేయడమా అన్న ఆలోచన వారిని వెంటాడుతోంది. ప్రభుత్వం వారిని ప్రస్తుతం ఓ హోటల్లో ఉంచింది. ‘రెండు రోజులుగా నాకు నిద్రపట్టడం లేదు. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లాలి. ఏంచేయాలి? ఇవే మమ్మల్ని వేధిస్తున్న ప్రశ్నలు’అని చాన్ అంటున్నారు. ‘ప్రభుత్వం అత్యవసర సాయం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దాతల నుంచి కూడా వస్తువులు, డబ్బు అందుతూనే ఉన్నాయి. అయితే, భవిష్యత్తు జీవితానికి అవి ఏమాత్రం అక్కరకు వస్తాయనేది తెలీడం లేదు’అని తెలిపారు. -
ఇంటి విలువ పెరగాలంటే..
గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లు.. గ్రేటర్ నగరానికే వన్నె తెచ్చాయి. వేల చదరపు అడుగుల్లో ఉండే క్లబ్హౌస్, ఏసీ జిమ్, స్విమ్మింగ్పూల్ వంటి సౌకర్యాల్ని సక్రమంగా నిర్వహించడం కత్తిమీద సామే. అయితే నగరానికి చెందిన కొన్ని నిర్మాణ సంస్థలు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతల్ని స్వయంగా నిర్వహిస్తే.. మరికొన్నేమో.. సదుపాయాల నిర్వహణ సంస్థలకు అప్పగిస్తున్నాయి. నిర్వహణ పక్కాగా ఉండటం వల్ల ఫ్లాట్ల రేట్లు రెట్టింపవుతున్నాయి.నెలసరి నిర్వహణ సక్రమంగా ఉంటేనే ఫ్లాటు విలువ పెరుగుతుంది. క్లబ్హౌస్లోని జిమ్, టెన్నిస్ వంటి సదుపాయాల కోసం విడిగా రుసుముల్ని చెల్లించాలి. హౌస్కీపింగ్, భద్రత, పార్కింగ్, కామన్ ఏరియాలు, విద్యుత్తు, లిఫ్టులు, తాగునీరు వంటి నిర్వహణ పనుల్ని నిర్వహణ సంస్థలే నిర్వహిస్తాయి.ఆధునిక సదుపాయాలు.. ఆహ్లాదకర వాతావరణం.. చిన్నారులు, పెద్దలు, మహిళలు, అందరికీ కావల్సిన అన్ని సౌకర్యాల్ని ఏర్పాటు చేయగానే సరిపోదు. వాటిని పక్కాగా నిర్వహించే సామర్థ్యం ఉండాలి. 2006లో జీవో నం.86 అందుబాటులోకి వచ్చాక నగరంలో ఆకాశహర్మ్యాల సంఖ్య పెరిగింది. ఇవి పూర్తవ్వడానికి మరో మూడేళ్లు పట్టింది.కొన్ని ప్రాజెక్టుల్లో ఆయా సంస్థలు సదుపాయాలు, సౌకర్యాల నిర్వహణను చూసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం.. నగరంలో ఫెసిలిటీ మేనేజ్మెంట్ సేవల్ని పక్కగా అందించే సంస్థలు పెద్దగా లేకపోవడమే. అయితే ఇలాంటి సంస్థలకు నిర్వహణ బాధ్యతను అప్పచెబితే నివాసితులపై అదనపు భారం పడుతుందనే ఉద్దేశంతో కొంతమంది బిల్డర్లే నిర్వహణ బాధ్యతల్ని చేపట్టారు. -
ఇండిపెండెంట్ ఇల్లు Vs అపార్ట్మెంట్లో ఫ్లాట్
సొంత ఇల్లు.. ప్రతి ఒక్కరి కల. అయితే ఈ కలను నెరవేర్చుకునే క్రమంలో చాలా మంది వ్యక్తిగత ఆర్థిక స్థోమతను, భవిష్యత్తు అవసరాలను పక్కన పెడుతున్నారు. సమాజం నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానంగా లేదంటే సామాజంలో హోదాను పెంచుకోవాలనే ఆరటంలో ఇండిపెండెంట్ ఇంటి (Individual House) కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. సరైన ఆర్థిక స్థోమత లేకుండా ఈ నిర్ణయం తీసుకుంటే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. భారీ ఈఎంఐలు, నిర్వహణ ఖర్చులు భరించలేక చివరికి ఆ ఇల్లు ఒక ‘ఖరీదైన అప్పు’గా మారి అభద్రతను మిగులుస్తుంది. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక భారం తగ్గించుకోవడానికి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేయడం ఒక ఆచరణాత్మకమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.1. కొనుగోలు వ్యయం, అప్పుల భారంఅంశంఇండిపెండెంట్ ఇల్లు (ప్లాట్ + నిర్మాణం)అపార్ట్మెంట్ ఫ్లాట్ప్రారంభ వ్యయంసాధారణంగా చాలా ఎక్కువ. స్థలం కొనుగోలు, నిర్మాణ వ్యయం, అనుమతులు, ఇతర ఖర్చులు.ఇండిపెండెంట్ ఇంటి కంటే వ్యయం తక్కువ. నిర్మాణ వ్యయం ఇందులో భాగమవుతుంది.అప్పుల భారంఅధిక వ్యయం కారణంగా గృహ రుణం తీసుకోవాల్సి రావచ్చు. ఇది దశాబ్దాల పాటు ఆర్థిక స్వేచ్ఛను అడ్డుకుంటుంది.తక్కువ వ్యయం కాబట్టి తక్కువ రుణం సరిపోతుంది. EMIలు తక్కువగా ఉంటాయి.నిర్మాణ సమయంసొంతంగా నిర్మాణం చేపట్టాలి కాబట్టి, సమయం, శ్రమ, ఒత్తిడి అధికం.నిర్మాణం పూర్తైన ఫ్లాట్ను కొనుగోలు చేస్తే ఒత్తిడి ఉండదు. 2. నిర్వహణ, జీవనశైలి వ్యయంఅంశంఇండిపెండెంట్ ఇల్లుఅపార్ట్మెంట్ ఫ్లాట్నిర్వహణభవనం, పెయింటింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వంటి అన్ని బాధ్యతలు ఉంటాయి.సాధారణ నిర్వహణ అనేది అపార్ట్మెంట్ అసోసియేషన్ చూసుకుంటుంది. నెలవారీ ఛార్జీ తక్కువగా ఉంటుంది.భద్రతసొంతంగా భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి (CCTV, వాచ్మెన్ మొదలైనవి).సామూహిక భద్రత (సెక్యూరిటీ గార్డులు) ఉంటుంది.సౌకర్యాలుసౌకర్యాలు సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి (బోర్, జనరేటర్ మొదలైనవి).సామూహిక సౌకర్యాలు (జిమ్, స్విమ్మింగ్ పూల్, పార్క్, జనరేటర్ బ్యాకప్) తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయి. ఇంటి కొనుగోలు అనేది కేవలం ఒక ఆస్తి మాత్రమే కాదు. అది ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం. ఇండిపెండెంట్ ఇల్లు అనేది వ్యక్తిగత గౌరవాన్ని పెంచినా అది ఆర్థికంగా కొన్నిసార్లు భారం అవ్వొచ్చు. ఆర్థికంగా బలహీనపడి సొంత ఇంటికి వాచ్మెన్గా మారడం కంటే స్థోమతకు తగ్గ ఫ్లాట్ను కొనుగోలు చేసి ఆర్థికంగా స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవించడమే అత్యంత ఆచరణాత్మకమైన నిర్ణయం అనేది కొందరి అభిప్రాయం.ఇదీ చదవండి: ర్యాంక్ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు -
వింత ఘటన: బొద్దింకను చంపబోయి..అపార్ట్మెంట్కే నిప్పటించింది..!
ఒక్కోసారి మనం చేసే పనులు ఎంత సీరియస్గా మారుతాయో అనేందుకు ఈ ఉదంతమే ఉదాహరణ. బహుశా అందుకే కాబోలు ఏ పనైనా చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అని అంటుంటారు పెద్దలు. ఈ ఘటన వింటే..ఎంత జాగురకతో ఉండాలో కచ్చితంగా అర్థమవుతుంది. అసలేం జరిగిందంటే..దక్షిణ కొరియాలో జరిగిన ఒక వింత ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించడమే కాదు, అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. అసలు ఇలా ఎలా జరిగిందని..అనుమానాలు లేవనెత్తేలా చర్చనీయాంశమైంది. ఒక మహిళ ప్రమాదవశాత్తు భవనానికి నిప్పంటిచడంతోనే ఈ ఘటన వార్తలో నిలిచింది. కేవలం బొద్దింకను చంపేందుకు ఫ్లేమ్ త్రోవర్(మండే స్ప్రే)ని ఉపయోగించడంతోనే ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఆమె బొద్దింకను చంపేందుకు ఎప్పుడైతే ఫ్లేమ్ త్రోవర్ ఉపయోగించిందో..ఆ మంటలు కాస్త వంటగదిలో ఉన్న వస్తువులకు వ్యాపించి..మొత్తం 32 అపార్ట్మెంట్ల రెసిడెన్సీ మంటల్లో చిక్కుకుపోయింది. రెండు నెలల శిశువుతో అదే ఫ్లోర్లో పొరుగున ఉన్న ఒక జంట ఈ ప్రమాదంలో చిక్కుకుపోయింది. పాపం వారు తమ బిడ్డను కాపాడుకునేందుకు పక్కంటి వారికి శిశువుని అప్పగించి కిటికీ గుండా తప్పించుకోవాలనుకున్నారు. ముందు భర్త బయటకు రాగా, ఆయన్నే అనుసరిస్తు వస్తున్న చైనాకు చెందిన మహిళ పట్టు తప్పి పడిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది. తీవ్ర గాయలపాలై మరణించిందామె. అంతేగాదు ఈ మంటలు గ్రౌండ్ఫ్లోర్లో వాణిజ్య యూనిట్లు, అక్కడే నివాసం ఉంటన్న కొన్ని కుటుంబాలు కూడా ప్రభావితమైనట్లు అధికారులు వెల్లడించారు. అంతేగాదు ఈ ప్రమాదం కారణంగా ఎనిమిదిమందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ దుర్ఘటనకు కారణం సదరు మహిళ నిర్లక్ష్యమే అంటూ ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేయాలని భావిస్తున్నారు పోలీసులు. పాపం ఏదో బొద్దింకల బెడద వదిలించుకోబోయి..చివరికి జైలుపాలై పరిస్థితి ఎదురైంది. ఏదో చేయిబోయి..ఇంకేదో అయినట్లు పాపం ఆ మహిళ ఒక్క బొద్దింకను మట్టుబెట్టాలనుకుంటే..ఓ ప్రాణాన్ని పొట్టనుబెట్టుకోవడం, పలువులరు గాయపడటానికి దారితీసింది.(చదవండి: క్యాబ్ డ్రైవర్గా మిలటరీ వైద్యుడు..! దయచేసి అలాంటి నిర్ణయం..) -
ఇలా చేస్తే ఇంటి విలువ తగ్గుతుంది
హైదరాబాద్లో ఓ హైరైజ్ అపార్ట్మెంటది. దాదాపు పదేళ్ల క్రితం నిర్మాణం పూర్తి చేసి.. నివాసిత సంఘానికి అప్పగించేసింది నిర్మాణ సంస్థ. రెండు మూడేళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే ఒకరిద్దరు ప్రతికూల సభ్యులతో నివాసిత సంఘం సర్వనాశనమైంది. పదేళ్ల క్రితం డెవలపర్ వసూలు చేసిన రూ.3.2 కోట్ల కార్పస్ ఫండ్.. ప్రస్తుతం వడ్డీతో సహా కలిపి రూ.4–5 కోట్ల వరకుంది. ఏం లాభం ప్రాజెక్ట్ నిర్వహణ చేసుకునే స్థితిలో అసోసియేషన్ లేదు. మధ్యలో ఓసారి కమ్యూనిటీ బాధ్యతలు చేపట్టేందుకు మహిళా సభ్యులు ధైర్యంగా ముందుకొస్తే.. వాళ్ల మీద లేనిపోని పోలీసు కేసులు పెట్టడంతో మనకొచ్చిన గొడవెందుకులే అని వాళ్లూ వెనుదిరిగారు. ఫలితంగా ఆ అపార్ట్మెంట్ రంగులు వెలిసి, రోడ్లు పాడైపోయి బోసిపోయింది. దీంతో ప్రస్తుతం అక్కడ అపార్ట్మెంట్ ధర చ.అ.కు రూ.5 వేలు ఉంటే.. ఈ ప్రాజెక్ట్లో మాత్రం రూ.3,500లకు మించి పలకట్లేదు. – సాక్షి, సిటీబ్యూరోరెసిడెన్షియల్ అసోసియేషన్లలో ఒకరిద్దరు సభ్యులతో కలిగే నష్టాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. నగరంలోని కమ్యూనిటీ అసోసియేషన్ల లో 50 శాతం వరకు ఇలాంటివే ఉంటాయంటే ఆశ్చర్యం లేదు. వార్షిక నిర్వహణ బాధ్యత నివాసిత సంఘాలదే అన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తే.. తగ్గేది మనం ఉండే ఇంటి విలువే.ప్రతీది బిల్డరే చేయాలంటే ఎలా?ప్రతి ఒక్కరూ కష్టపడినే సొమ్ముతోనే ఇల్లు కొనుక్కుంటారు. పండుగలకు, ప్రత్యేక సందర్భాలలో ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోమా? నాలుగైదేండ్లకు ఒకసారి రంగులు వేసుకోవటం, పగుళ్లు వచ్చినా, డ్రైనేజీ, బోర్, లిఫ్ట్ వంటి వాటిల్లో సమస్యలొస్తే రిపేరు చేసుకోమా? అలాగే అపార్ట్మెంట్లలో ఉండే వాళ్లూ అంతే అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి చేసుకోవాలే తప్ప.. ప్రాజెక్ట్లో ఏ నిర్వహణ పనులైనా బిల్డరే చేయించాలని పట్టుబడుతూ కూర్చుంటే పాడైపోయేది మీరు ఉండే ఇళ్లేనని గుర్తుంచుకోండి. నిర్వహణ వ్యయాన్ని కార్పస్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టుకోవాలే గానీ అన్నింటికీ బిల్డరే చేయాలని కూర్చుంటే మూర్ఖత్వమే అవుతుంది. ఎవరి ప్రాపరీ్టని వాళ్లే కాపాడుకోవాలి.పైన పటారం.. లోన లొటారం..‘పైన పటారం లోన లొటారం’ అన్న చందంగా.. భవనం బయట నుంచి చూస్తే రంగులు వెలిసి, రోడ్లు పాడైపోయి వికారంగా కనిపిస్తుంటుంది గానీ అదే అపార్ట్మెంట్ లోపలికి వెళ్లి చూస్తే మాత్రం అందమైన ఇంటీరియర్తో లగ్జరీగా బాగుంటుంది. అయినా ఏం లాభం బయటి నిర్మాణం అంద విహీనంగా కనిపిస్తుంటే ఇంటి విలువ తగ్గుతుంది. పాజిటివ్ మైండ్సెట్ ఉన్న సభ్యులనే ఎన్నుకొని ప్రాజెక్ట్ను అభివృద్ధి పరుచుకోవాలని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు.నివాసిత సంఘానికి సప్త సూత్రాలు!➤పాజిటివ్ మైండ్ ఉన్న వాళ్లనే అధ్యక్షులుగా ఎన్నుకోవాలి. నిర్వహణ కోసం వారిని ప్రోత్సహించాలి. వాళ్ల పనులకు అడ్డుపడుతూ, లోపాలను ఎంచకూడదు.➤ఇదేమీ వేతనం వచ్చే పదవి కాదు. సామాజిక సేవ లాంటిదే. అలాంటప్పుడు వాళ్ల పనులు వదిలేసి మన ప్రాజెక్ట్ బాగుండాలని, అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో ముందుకొస్తే లేనిపో ని మాటలతో, అభాండాలను వేయకూడదు.➤ప్రతి అసోసియేషన్లో 2 శాతం నెగిటివ్ మైండ్సెట్ ఉన్న సభ్యులుంటారు. వాళ్లను వదిలేసి మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు నిర్ణయాలను తీసుకోవాలి. ఒకరిద్దరు సభ్యుల చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు.➤కమ్యూనిటీ అంతా ఒక కుటుంబంలా ఉంటే.. ఆనందం, ఆరోగ్యంతో పాటు బయటి వాళ్లలో కమ్యూనిటీ పట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. దీంతో ప్రాజెక్ట్ విలువ పెరుగుతుంది.➤పిల్లలు ఉంటే వీకెండ్స్, సెలవు రోజుల్లో ఆటలు, సాంసృతిక పోటీల వంటివి నిర్వహించాలి. పెద్దల కోసం తీర్థయాత్రలు, వన భోజనాల వంటివి ఏర్పాటు చేయాలి.➤రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థలను క్రమం తప్పకుండా చెక్ చేపించాలి. పార్క్, గ్రీనరీ, లిఫ్ట్, జనరేటర్ వంటి వసతులను నిర్వహణ చేసుకోవాలి. ఇందుకోసం అయ్యే వ్యయాలను సభ్యులు అందరూ కలిసి పంచుకోవాలి. -
అపార్ట్మెంట్ మెయింటెనెన్స్పై జీఎస్టీ.. ఇదిగో క్లారిటీ..
అపార్ట్మెంట్ మెయింటెనెన్స్పై జీఎస్టీకి సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. నెలవారీ మెయింటెనెన్స్పై జీఎస్టీ వర్తింపునకు సంబంధించి అపార్ట్మెంట్ యజమానులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (ఆర్డబ్ల్యూఏ)ల్లో నెలకొన్న అయోమయాన్ని తొలగించేందుకు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రయత్నించింది.జీఎస్టీ విధింపుపై అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లలోని నివాసితుల్లో నెలకొన్న అయోమయంపై వార్తా కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రెస్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ విభాగానికి చెందిన డైరెక్టర్ జనరల్ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్డబ్ల్యూఏ మొత్తం టర్నోవర్ రూ.20 లక్షలు దాటకుండా అదే సమయంలో ఒక్కో సభ్యుడి మెయింటెనెన్స్ ఛార్జీల మొత్తం నెలకు రూ.7,500 దాటినా కూడా జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.ఇలా అయితేనే జీఎస్టీరెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లలోని ఒక్కో సభ్యుడు చెల్లించే నెలవారీ మెయింటెన్స్ రూ.7,500 కంటే ఎక్కువ ఉండి ఆ అసోసియేషన్ వసూలు చేసే మెయింటెన్స్ మొత్తం కూడా సంవత్సరానికి రూ .20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఆర్డబ్ల్యూఏ తన సభ్యుల నుండి వసూలు చేసే నెలవారీ సబ్స్క్రిప్షన్ లేదా కంట్రిబ్యూషన్పై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.ఇక హౌసింగ్ సొసైటీ లేదా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో రెండు లేదా అంతకంటే ఎక్కువ రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లు కలిగి ఉన్నవారికి తమ ప్రతి రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ కు నెలకు రూ.7,500 చొప్పున పరిమితిని వేర్వేరుగా వర్తింపజేయాలని స్పష్టం చేసింది. అంటే ఒక్కో సభ్యుడికి నెలకు రూ.7,500 దాటితే మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. ఉదాహరణకు మెయింటెనెన్స్ ఛార్జీలు ఒక్కో సభ్యుడికి నెలకు రూ.9,000 అయితే రూ.1,500 వ్యత్యాసంపై కాకుండా మొత్తం రూ.9,000పై 18 శాతం జీఎస్టీ చెల్లించాలి.ఆర్డబ్ల్యూఏలు, హౌసింగ్ సొసైటీలకు ప్రయోజనం చేకూర్చడానికి 2018 జనవరి 18న జీఎస్టీ కౌన్సిల్ తన 25వ సమావేశంలో అపార్ట్మెంట్ మెయింటెనెన్స్పై జీఎస్టీ మినహాయింపు పరిమితిని రూ .5,000 నుండి రూ .7,500 కు పెంచింది.


