● గొంతు నులిమి వృద్ధురాలిని హత్యచేసిన దుండగులు ● బంగారం, వెండి ఆభరణాలు అపహరణ
అశ్వాపురం: మెడలో వేసుకున్న బంగారం, వెండి ఆభరణాలే ఆ వృద్ధురాలి పాలిట శాపమయ్యాయి. రాత్రి సమయాన ఇంట్లో నిద్రిస్తుండగా దొంగలు ఇంట్లోకి చొరబడి ఆమె గొంతు నులిమి హతమార్చి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని తురంవారిగూడెం గ్రామానికి చెందిన జర్పుల సువాలి (62) శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తోంది. ఈక్రమాన గుర్తుతెలియని దుండగులు ఆమె గొంతు నులిమి హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. ఆమె వద్ద మొత్తం మూడు తులాల బంగారపు చైన్, చెవుల కమ్మలు, ఐదు తులాలు వెండి పట్టీలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న సీఐ ఎల్లయ్య, మణుగూరు డీఎస్పీ రవీందర్రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలు కుమారుడు నాగార్జున ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


