పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు. డీర్ పార్కులోని దుప్పులను, డ్యామ్పైనుంచి జలాశయాన్ని వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. 433 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా రూ.19,215, సఫారీ ద్వారా రూ.10,050 వైల్డ్లైఫ్ విభాగానికి ఆదాయం లభించింది. 160 మంది బోటింగ్ చేయగా రూ.8,280 ఆదాయం టూరిజం శాఖకు లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
‘విన్ విజన్’
ఆస్పత్రి ప్రారంభం
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మంలో ఏర్పాటు చేసిన విన్ విజన్ కంటి ఆస్పత్రిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. మాజీ ఎంపీ రామసహాయం సురేందర్రెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి వారి మన్నలను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నాయకులు సాధు రమేష్రెడ్డి, నాగళ్ల దీపక్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.
గిరిజన దర్బార్కు
హాజరు కావాలి
భద్రాచలంటౌన్: ఐటీడీఏలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్, సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజావాణి కార్యక్రమాలకు అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ సూచించారు. ఈ మేరకు ఆదివారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10.30 గంటలకు ఆయా కార్యాలయాల సమావేశ మందిరాల్లో తప్పనిసరిగా హాజరుకావాలని పేర్కొన్నారు.
ప్రమాదవశాత్తు
ట్రాక్టర్ డ్రైవర్ మృతి
పాల్వంచరూరల్: అతివేగంగా, నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపిన డ్రైవర్ చెట్టును ఢీకొని ప్రమాదవశాత్తు మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. బూర్గంపాడు మండలం ఉప్పుసాక గ్రామానికి చెందిన సున్నం శివాజీ(25) సీతారామసాగర్ ప్రాజెక్టులో లస్కర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం పాల్వంచ పట్టణంలోని శివనగర్లో నివాసం ఉంటున్న అన్న శ్రీకాంత్ ఇంటికొచ్చి తిరిగి టీజీ 28 సీటీఆర్ 0473 నంబర్ గల ట్రాక్టర్ను తీసుకుని స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈక్రమాన పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామ శివారులో ట్రాక్టర్ను అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడంతో ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టాడు. దీంతో శివాజీ కిందపడగా ట్రాక్టర్ టైర్ మీద నుంచి వెళ్లడంతో త్రీవగాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న తాటి విజయ్, సోలం సారయ్యలు గమనించి పాల్వంచలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి సోదరుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు.
పాల వ్యాన్ బోల్తా..
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ కళాశాల ఎదురు రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున పాల లోడుతో వెళ్తున్న వ్యాన్ (టీజీ 05 టీ 9447) అదుపు తప్పి రహదారిపై బొల్తా పడింది. ఈ ప్రమాదంలో పాలన్నీ రోడడ్డుపాలు కాగా గమనించిన స్థానికులు డ్రైవర్, క్లీనర్లను సురక్షితంగా బయటకు తీశారు. వారికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అతి వేగం, డ్రైవర్ నిద్రమత్తుతో ప్రమాదం జరిగిఉంటుందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.


