ఏళ్లుగా గణపతి ఉత్సవాల నిర్వహణ ● ఉమ్మడి జిల్లాలో పలు మండపాల ప్రత్యేకత
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం నగర గణపతి ఉత్సవాల చరిత్రలో గాంధీచౌక్ యూత్ది మైలురాయిగా నిలిచిపోతుంది. 1979లో కొందరు యువకులు మొదలుపెట్టిన చిన్న ఉత్సవం నేడు శ్రీ విజయ గణపతి దేవస్థానంగా మారి నగరంలోని వేలాది మండపాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఖమ్మంలో తొలిసారి గాంధీచౌక్లో 1979లో వినాయక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గాంధీ చౌక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యాన అనుముల రమేష్ బాబు, మువ్వల వెంకటేశ్వర్లు, పసుమర్తి శివరామకష్ణ, కుంచపర్తి రమేష్, ఉండేలా గౌరీనాథ్, చెరుకూరి భాస్కర్, గోళ్ల భాస్కర్, అనుముల శ్రీనివాసరావు తదితరులు కమిటీగా ఏర్పడి శ్రీకారం చుట్టారు. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా భక్తులను ఆకర్షించేలా మోటార్ సైకిల్ లక్కీ డ్రా, రాత్రి వేళల్లో భక్తి సినిమాల ప్రదర్శన చేపట్టేవారు. అయితే, నగరంలో వినాయక దేవస్థానం లేకపోవడాన్ని గుర్తించిన కమిటీ గాంధీచౌక్లో స్థలాన్ని ఎంచుకొని శ్రీ విజయ గణపతి దేవస్థానాన్ని నిర్మించారు. ఇదే నగరంలోని తొలి వినాయక ఆలయం. ప్రస్తుతం 23 మంది శాశ్వత సభ్యులుగా ఆలయ నిర్వహణ, ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఖమ్మంలోని శ్రీ విజయ గణపతి దేవస్థానంలో ఏటా నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం. వందలాది మంది భక్తులు మాలధారణ చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. బ్రహ్మోత్సవాలు సంప్రదాయాలకు అనుగుణంగా మార్గదర్శకంగా నిలుస్తున్నాం.
– పసుమర్తి శివరామకృష్ణ,
మువ్వల వెంకటేశ్వర్లు, దేవస్థాన చైర్మన్, కోశాధికారి


