త్వరలోనే అమలు...
● లైసెన్స్ దరఖాస్తుదారులకు వీడియో పాఠాలు ● ఆర్టీఏ కార్యాలయాల్లో నిర్వహణకు ఏర్పాట్లు ● మూడు గంటల పాఠం.. ఆతర్వాతే ట్రాక్ టెస్ట్
ఖమ్మం క్రైం: వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఆర్టీఏ అధికారులు కొత్త నిబంధన తీసుకొస్తున్నారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాకే లైసెన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం లైసెన్స్ దరఖాస్తుదారులకు ముందుగా వీడియో పాఠాలు బోధించనున్నారు. ఇప్పటికే ఈ విధానం హైదరాబాద్లోని కూకట్పల్లి ఆర్టీఏ కార్యాలయంలో అమలవుతోంది. త్వరలోనే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ నూతన విధానం ప్రవేశపెట్టనున్నారు.
మూడు గంటల వీడియో
సాధారణంగా వాహనదారులకు తొలుత లెర్నింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. ఇందుకోసం కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాస్తే లైసెన్స్ జారీ అవుతుంది. ఇది తీసుకున్న 30రోజుల నుంచి ఆరు నెలల్లోగా పర్మి నెంట్ లైసెన్స్ తీసుకోవాలి. ఈమేరకు దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పటివరకు డ్రైవింగ్ టెస్ట్కు హాజరుకావాలనే నిబంధన ఉంది. దీనికి తోడు ఇకపై ఆర్టీఏ కార్యాలయంలో మూడు గంటల వీడియో పాఠాలు చూడాల్సి ఉంటుంది. ఇందులో రహదారి భద్రత అంశాలు, రహదారి నిబంధనలపై అవగాహన కల్పించి ఆతర్వాత డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి ఉత్తీర్ణులైతేనే పర్మినెంట్ లైసెన్స్ జారీ చేస్తారు. అంటే లెర్నింగ్ లైసెన్స్ ఉన్నవారు పర్మినెంట్ లైసెన్స్ కోసం తప్పనిసరిగా మూడు గంటల వీడియో పాఠాలను వినాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి టీజీ ఆన్లైన్లో వీడియో పాఠాల మాడ్యూల్స్ పొందుపరిచారు. కాగా, ఆన్లైన్లో పాఠాలు వినే సమయాన దరఖాస్తుదారుల ముఖకవళికలు కూడా నమోదు చేస్తారు. ఆతర్వాత టెస్ట్కు అనుమతిస్తారు. రోడ్డు భద్రతపై పూర్తి అవగాహన ఉన్నవారికే లైసెన్స్ జారీ చేయాలనే భావనతో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పర్మినెంట్ లైసెన్స్ కోసం ప్రతీ వాహనదారుడు వీడి యో పాఠాలు వినాల్సి ఉంటుంది. కూకట్పల్లిలో అమలవుతున్న ఈ విధానం జిల్లాలో త్వరలోనే అమలుకా నుంది. ఇప్పటికే ఈ విషయమై డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులకు అవగాహన కల్పించాం. ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే నూతన విధానాన్ని ప్రారంభిస్తాం.
– శ్రీనివాస్, జిల్లా రవాణాశాఖాధికారి, ఖమ్మం


