ఐటీడీఏ పీఓ రాహుల్
గుండాల: తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఏకలవ్య, గురుకుల, ఆశ్రమ పాఠశాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల మధ్య వర్గ విభేధాలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఐటీడీఏ పీఓ రాహుల్ హెచ్చరించారు. నాలుగు రోజులుగా ఏకల వ్య పాఠశాలలో జరుగుతున్న సంఘటనల నేపథ్యాన శనివారం ఆయన పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యాలయాల్లోకి పోలీసులు ప్రవేశించడం చట్టవిరుద్ధమని, అలా చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులందరూ సమన్వయంతో ఉండి ఉపాధ్యాయులనే తల్లిదండ్రులుగా భావించి బాగా చదివి వృద్ధిలోకి రావాలన్నారు.
నాయకుల అరెస్ట్
మండలంలోని ముత్తారం ఏకలవ్య పాఠశాలఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని నాలుగు రోజులుగా ఆదివాసీ సంఘాల నాయకులు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. శుక్రవారం నుంచి చుంచు రామకృష్ణ ఆమరణ నిరాహార దీక్షకు దిగగా, అర్ధరాత్రి ఆయనతోపాటు మరో నలుగురి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇల్లెందుకు తరలించి శనివారం ఉదయం విడుదల చేశారు.
ఆదివాసీల మనోభావాలను దెబ్బతీయొద్దు
ఇల్లెందు: ఆదివాసీల మనోభావాలను దెబ్బ తీసేలా తీజ్ పండుగ నిర్వహించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాల జేఏసీ కన్వీనర్ చుంచు రామకృష్ణ, తుడుందెబ్బ జాతీయ కార్యదర్శి కొడెం వెంకటేశ్వర్లు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకుడు వీసీ దొర డిమాండ్ చేశారు. శనివా రం ఇల్లెందులో కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. కలెక్టర్, పీఓ హామీ మేరకు దీక్ష విరమించినట్లు తెలిపారు. 95శాతం ఆదివాసీ లు ఉన్న గుండాల మండలంలోని విద్యాసంస్థల్లో మరో సామాజిక వర్గానికి చెందిన గెస్ట్ ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పి.నాగరాజు, యాకయ్య, సత్యనారాయణ, రామ్మూర్తి పాల్గొన్నారు.


