జిల్లాలో 53 చెరువులకు అలుగు
పలుచోట్ల పొంగిపొర్లుతున్న చెక్ డ్యామ్లు
పాల్వంచరూరల్: ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అడపాదడపా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరుతోంది. కొన్ని నిండి జలకళ సంతరించుకున్నాయి. జిల్లాలో మొత్తం 2,144 చెరువులు ఉండగా, ఇందులో 53 చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. మరికొన్ని నిండేదశకు చేరుకున్నాయి. ఎక్కువ చెరువుల్లో సగానికి మించి నీరు చేరింది. పాల్వంచ మండలంలోని జోగారావు చెరువు, ఎర్రసాని చెరువు, మందెరకలపాడు వద్ద రాళ్లవాగు పిక్డ్యామ్ అలుగుపోస్తున్నాయి. జగన్నాథపురం, రంగాపురం, నాగారం, దంతలబోరు చెరువుల్లో 75శాతానికి పైగా నీళ్లు చేరాయి. కిన్నెరసాని వాగుచెక్ డ్యామ్లు పొంగిపొర్లుతున్నాయి.
రైతుల హర్షం
కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువుల్లోకి వరద నీరు చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అరకొరగా నిండిన చెరువుల కింద పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఊరటనిస్తున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్ట్, ఎర్రసాని చెరువు, రాళ్లవాగు ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎల్నినో ప్రభావం కారణంగా వర్షభావ పరిస్థితులు ఉన్నాయి. భారీ వర్షాలు కురువని కారణంగా జిల్లాలో చెరువులు, కుంటలు ఇంకా పూర్తిగా నిండలేదు. ఈనెలలోనైనా భారీ వర్షాలు కురిస్తే చెరువులు నిండుతాయని భావిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న నీళ్లు పంటల సాగుకు సరిపోవు.
–శ్రీనివాసరెడ్డి, జిల్లా జలవనరులశాఖ సీఈ
మొత్తం చెరువులు 2,144
అలుగు పోస్తున్నవి 53
25 శాతం వరకు నిండినవి 588
25 నుంచి 50శాతం వరకు నిండినవి 763
50నుంచి75శాతం వరకు నిండిననవి 436
75 నుంచి 100శాతం నిండినవి 304


