ఇంగ్లిష్ మీడియం పుస్తకాలు మాత్రమే అరకొరగా పంపిణీ తెలుగు మీడియం, ఒకేషనల్ పుస్తకాల పంపిణీలో జాప్యం సిలబస్లో మార్పులతో ఆలస్యమైందంటున్న అధికారులు
కొత్తగూడెంఅర్బన్: ఇంటర్మీడియట్ కళాశాలలు ప్రారంభమై నెలరోజులు గడిచినా విద్యార్థులకు కొత్త పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. పుస్తకాలు అరకొరగా రావడంతో విద్యార్థులకు అందరికీ అందని పరిస్థితి నెలకొంది. రెండో విడత పాఠ్యపుస్తకాలు వచ్చాక అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో విద్యార్థులు నోట్ పుస్తకాలతోనే కళాశాలలకు హాజరవుతున్నారు. ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో సిలబస్లో కొంత మార్పులు చేపట్టడంతో ప్రింటింగ్, పంపిణీ ప్రక్రియలో ఆలస్యం జరిగిందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు చెబుతున్నారు. మారిన సిలబస్లో అదనంగా కొత్త అంశాలు చేర్చలేదని, కొన్ని పాఠ్యంశాలను తొలగించారని, కొత్త పుస్తకాలు వచ్చేవరకు పాత పుస్తకాలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. జిల్లాకు రావాల్సిన పాఠ్యపుస్తకాలు ఎన్ని, ఇప్పటివరకు ఎన్ని వచ్చాయి? మిగతావి ఎప్పుడొస్తాయి? వంటి వివరాలను ఇంటర్మీడియట్ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. పైగా జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా పాఠ్యపుస్తకాల కొరత లేదని చెబుతున్నారు.
ఇంటర్ మొదటి సంంవత్సరం సిలబస్లో ఈ ఏడాది కొంత మార్పులు జరిగాయి. మార్పులు చేసిన తెలుగు మీడియం కొత్త పుస్తకాలు ఇంకా జిల్లాకు రాలేదు. కళాశాలలో ఉన్న పాత పాఠ్యపుస్తకాలను వినియోగించుకోవాలని సూచించాం. ఒకేషనల్ గ్రూప్ల పాఠ్యపుస్తకాలు కూడా రావాల్సి ఉంది. రాగానే విద్యార్థులకు అందజేస్తాం.
–హెచ్.వెంకటేశ్వర్లు,
జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి
ఇంటర్ విద్యార్థులకు అందని పాఠ్యపుస్తకాలు


