సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో 17 గ్రామాల్లో రీ సర్వే నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని కలెక్టర్ అంకిత్ తెలిపారు. భూ రీ సర్వే, భూ భారతి అమలు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇళ్లు, 2బీహెచ్కే ఇళ్ల పంపిణీ, పాఠశాల విద్యార్థులకు యూనిఫాం పంపిణీ తదితర అంశాలపై రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తొలి దశలో 14 గ్రామాలను ఎంపిక చేసి పాల్వంచ, గుండాల, పినపాక,దుమ్ముగూడెం, బూర్గంపాడు మండలాల్లో సుమారు 4వేల ఎకరాల సర్వే పూర్తి చేసే లక్ష్యంతో చర్యలు చేపట్టామని వివరించారు. జిల్లాలోని అక్కినేపల్లిలో 8,990 ఎకరా లకు గాను సుమారు 4,900 ఎకరాల సర్వే పూర్తయిందని తెలిపారు. గుండాల మండలంలో సర్వే పనులు కొనసాగుతున్నాయని, పెద్ద వెంకటాపురం గ్రామంలో 537 ఎకరాలు, శుభంపేట గ్రామంలో 267 ఎకరాల సర్వే పూర్తయిందన్నారు. మాదారం గ్రామంలో సోమవారం నుంచి రీ సర్వే ప్రారంభించనున్నట్లు తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథ కం పరిధిలో ఈ నెలలోనే 5 వేల ఎకరాలకు భూ సర్వే చేపట్టినట్లు వెల్లడించారు. కొత్తగూడెం ఆర్డీఓ మధు, ఏడీ ల్యాండ్స్ సర్వే అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
1.78 లక్షల మందికి రైతు భరోసా
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని అర్హులైన రైతుల ఖాతాల్లో రైతుభరోసా నగదు జమ ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ అంకిత్ తెలిపారు. శనివారం వివరాలు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 1,78,828 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ 318.42 కోట్లు జమ చేశామన్నారు. రైతు భరోసా నగదును బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ రుణ బకాయిలు, సేవా చార్జీలు/ఇతర బకాయిల పేరుతో నిలుపుదల చేయడం, డెబిట్, సర్దుబాటు చేయొద్దని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. రైతులు పంటల పెట్టుబడికే వినియోగించుకోవాలన్నారు.
కలెక్టర్ అంకిత్


