రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మంమయూరిసెంటర్: ఆపదలో ఉన్న ప్రతీ నిరుపేద కుటుంబానికి అండగా నిలుస్తూ, పేదల కన్నీళ్లు తుడవడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 129 మందికి మంజూరైన రూ.35,91,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు ఖమ్మం రూరల్ మండలానికి చెందిన ముగ్గురికి కళ్యాణలక్ష్మి చెక్కులను శనివారం ఆయన అందజేశారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ నిరుపేదలకు వైద్య ఖర్చులు భారం కావొద్దని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వేగంగా చెక్కులు జారీ చేస్తున్నామని తెలిపారు.
ప్రాధాన్యతగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి
ఖమ్మం రూరల్/తిరుమలాయపాలెం: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పేదల సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఖమ్మం రూరల్ మండలం ఆరేకోడులో రూ. 2.24 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి శంకుస్థాపన చేశాక ఆరేకోడు తండా గ్రామంలో పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఇదే వేదికపై గ్రామానికి చెందిన 20 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. అలాగే, తిరుమలాయపాలెం మండలం రమణతండా నుంచి ములకలపల్లి – తిరుమలాయపాలెం బీటీ రోడ్డు వరకు రూ.1.94 కోట్లతో నిర్మించే లింక్ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో 19 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 77 మందికి రూ. 24.67 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.


