భద్రాచలంఅర్బన్ : శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ కరీంనగర్ ఈడీ సోలోమన్ అన్నారు. భద్రాచలంలో గురువారం ఆయన ఖమ్మం ఆర్ఎం సరిరామ్, డిప్యూటీ ఆర్ఎం మల్లయ్యతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామయ్య కల్యాణానికి వచ్చిన ప్రతీ భక్తుడిని తిరిగి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాలని, ఈ మేరకు ప్రతీ ఉద్యోగి కృషి చేసి ఆర్టీసీకి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉన్నందున శ్రీరామనవమికి భారీగా భద్రాచలం వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని రూట్లలో ప్రయాణికులకు ఎలాంటి సమస్య రాకుండా బస్సులు ఏర్పాటు చేయాలని ఖమ్మం రీజియన్ పరిధిలోని డీఎంలకు సూచించారు. ఖమ్మం రీజియన్ నుంచి భద్రాచలం – ఖమ్మం – హైదరాబాద్ రూట్లలో నడిచే బస్సుల సంఖ్య ప్రస్తుతం 113 ఉండగా అదనంగా 121 సర్వీసులు పెంచి మొత్తం 234 బస్సులు తిప్పనున్నామని, ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చే బస్సుల సంఖ్య 45 కాగా, రద్దీని దృష్టిలో పెట్టకుని అదనంగా మరికొన్ని బస్సులు నడుపనున్నామని వివరించారు. హైదరాబాద్ – భద్రాచలం వచ్చి వెళ్లే ప్రయాణికులకు రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పించామని, అవసరమైన వారు www.tgsrtc.in ద్వారా రిజర్వేషన్ చేసుకోవాలని కోరారు. సమావేశంలో డీఈఈ రవీందర్, ఖమ్మం రీజియన్, ఏపీ ప్రాంత డీఎంలు పాల్గొన్నారు.
ఆర్టీసీ కరీంనగర్ ఈడీ సోలోమన్


