మందగించిన బొగ్గు రవాణా..?
టిప్పర్ల యజమానుల ఆందోళన
టేకులపల్లి: కోయగూడెం ఓసీలో ఏడెనిమిది నెలలుగా బొగ్గు రవాణా గణనీయంగా తగ్గింది. బొగ్గు ఉత్పత్తి చేయడంతోపాటు సకాలంలో రవాణా చేయడం కూడా ముఖ్యమే. కానీ, బొగ్గు రవాణాపై దృష్టి సారించాల్సిన కోయగూడెం ఓపెన్కాస్టు అధికారులు ఆ దిశగా ఆలోచించకపోవడమే ఈ పరిస్థితికి కారణం అని తెలుస్తోంది. కోయగూడెం ఓసీ నుంచి గతంలో ప్రతీరోజు వివిధ పరిశ్రమలకు సుమారు 15 నుంచి 18 వేల టన్నుల బొగ్గు రవాణా అయ్యేది. కానీ, కొంతకాలంగా అతికష్టంగా పది వేల టన్నులు కూడా రవాణా జరగడం లేదని సమాచారం. నవభారత్కు రోజూ సుమారు 6,000 టన్నుల బొగ్గు పంపించాల్సి ఉండగా కేవలం 2,500 నుంచి 3,000 టన్నులు మాత్రమే రవాణా చేస్తున్నారని, ఆర్సీహెచ్పీకి రోజూ సుమారు 8 వేల టన్నుల బొగ్గు రవాణా చేయాల్సి ఉండగా మూడు నుంచి నాలుగు వేల టన్నులు మాత్రమే రవాణా చేస్తున్నారని తెలిసింది. బొగ్గును టిప్పర్లు, బాడీలకు లోడ్ చేసేందుకు గతంలో టెరెక్సులు ఉండేవి. ప్రస్తుతం కేఓసీలో టెరెక్సులు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత టెరెక్స్లను పెట్టుకుని బొగ్గు లోడ్ చేసుకుంటున్నామని, దీంతో తమపై అదనపు భారం పడుతుందని కోల్ ట్రాన్స్పోర్టర్లు వాపోతున్నారు. ఇదిలా ఉండగా కేఓసీని నమ్ముకుని టిప్పర్లు కొనుగోలు చేసినవారి పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో రోజుకు నాలుగు, ఐదు ట్రిప్పు ల లోడింగ్ ఉండగా.. ఇప్పుడు ఒక ట్రిప్ మాత్రమే పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోయగూడెం ఓపెన్ కాస్ట్ నుంచి బీపీఎల్, నవభారత్, ఇతర ప్రాంతాలకు బొగ్గు రవాణా అవుతోంది. స్థానికులు, భూ నిర్వాసితులు సుమారు 170కి పైగా లారీలు, టిప్పర్లు కొనుగోలు చేసి బొగ్గు లోడింగ్ చేస్తున్నారు. 14, 12 టైర్ల టిప్పర్ల యజమానులు బీపీఎల్, నవభారత్కు బొగ్గు రవాణా చేస్తున్నారు. అయితే, ఈ బొగ్గు రవాణా చేసేందుకు ఓ కాంట్రాక్టర్ యత్నిస్తుండటంతో ఆందోళన చెందిన వారు మంగళవారం టేకులపల్లి మండలం చుక్కాలబోడు క్రాస్రోడ్లోని టిప్పర్ లారీ ఓనర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. 16 టైర్ల టిప్పర్లు బొగ్గు రవాణాకు వాడటం వల్ల 14, 12 టైర్ల టిప్పర్ యజమానులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, తమకు లోడింగ్ రాదని, ఆర్థిక సమస్యలు ఏర్పడి కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
కేఓసీ అధికారుల నిర్లక్ష్యమే కారణమా..?


