
ఎమ్మెల్యే సార్ !
8లో
అప్పుడు ఆశ్రమ బడుల్లో పురుగుల అన్నమే..
స్కౌట్స్ అండ్ గైడ్స్తో క్రమశిక్షణ పెరిగింది
టీచర్ల చేతిలోనే విద్యార్థుల బంగారు భవిష్యత్
పదేళ్ల పట్టుదల ఫలితమే నేటి ఎమ్మెల్యేగిరీ
ఆత్మగౌరవానికి ప్రతీక..
ఎమ్మెల్యేగా ఖద్దరు బట్టల్లో నిత్యం కనిపించినప్పటికీ ఏదైనా స్కూల్కు వెళ్లి విద్యార్థులను కలిసేప్పుడు కచ్చితంగా పైన కోటు ధరిస్తాను. కోటుతో హుందాతనం వస్తుంది. ఆత్మగౌరవం పెరుగుతుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిన్ననాటి నుంచి అనేక కష్టాలు అనుభవించినా ఆత్మగౌరవ ప్రతీకగా సూటు కోటు ధరించేవారు. నేను ఎన్నో కష్టాలకు ఓర్చి ఈ స్థాయికి వచ్చాను. అందుకే విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ఫుల్ సూట్ ధరిస్తుంటాను.
బియ్యంలో పురుగులు ఏరుకుని..
మాది దమ్మపేట మండలం గండుగులపల్లి. తల్లిదండ్రులు చుక్కమ్మ, సత్యనారాయణ. మాకు నాలుగెకరాల పొలం ఉండేది. అయినా ఆర్థిక ఇబ్బందులు మా కుటుంబాన్ని వెంటాడుతూనే ఉండేవి. అందుకే నా చదువంతా ఆశ్రమ పాఠశాలల్లోనే సాగింది. ఐదో తరగతి వరకు అంకంపాలెం, ఆ తర్వాత పదో తరగతి వరకు పార్కలగండి ఆశ్రమ స్కూళ్లలో, ఇంటర్ కిన్నెరసాని స్పోర్ట్స్ కాలేజీలో చదివాను. అప్పుడు ఆశ్రమ పాఠశాలకు సరఫరా చేసే బియ్యంలో పురుగులు ఎక్కువగా ఉండేవి. ప్రతీ ఆదివారం విద్యార్థులందరం ఆ పురుగులు ఏరేవాళ్లం. అలా శుభ్రం చేసిన బియ్యాన్నే ఆ తర్వాత వారం పాటు వండిపెట్టేవారు. అలా డిగ్రీ వరకు ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ చదువుకుని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ)గా 2005లో సున్నంబట్టి స్కూల్లో ఉద్యోగం సాధించా.
1998లో ప్రెసిడెంట్ మెడల్..
హై స్కూల్లో ఉన్నప్పటి నుంచి స్కౌట్స్ అండ్ గైడ్స్లో చురుగ్గా ఉండేవాడిని. ఈ క్రమంలో 1998లో ఒడిశాలో జరిగిన అంతర్జాతీయ స్థాయి (వరల్డ్ జంబోరి) పోటీల్లో 48 దేశాలు పోటీపడగా భారత్ నుంచి ఎనిమిది మందిమి ప్రాతినిధ్యం వహించాం. అందులో నాకు ‘ఎ’ గ్రేడ్ రావడంతో అప్పటి ఉపరాష్ట్రపతి కేఆర్ నారాయణ్ చేతుల మీదుగా ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నాను. స్కౌట్స్లో పని చేయడం వల్ల చిన్నతనంలోనే క్రమశిక్షణ, సమయ పాలన, సామాజిక బాధ్యతలు అలవాటయ్యాయి. స్పోర్ట్స్ జూనియర్ కాలేజ్లో ఉన్నప్పుడు రన్నింగ్, జావెలిన్త్రో, హైజంప్ బాగా చేసేవాడిని. దీంతో శారీరక దారుఢ్యం పెరిగింది. మ్యాథ్స్లో ఎమ్మెస్సీ పూర్తి చేసినప్పటికీ డిమాండ్ ఉన్న లెక్కల టీచర్గా వెళ్లడం కంటే విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పే పీఈటీగా పని చేసేందుకే మొగ్గు చూపాను.
రాజకీయ ప్రస్థానం..
మా మేనమామ ముత్యాలు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశారు. ఆయన ప్రోద్బలంతో 2014లో టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున అశ్వారావుపేట నుంచి పోటీ చేశా. ఆ సమయంలో నాచుట్టూ ఎప్పుడూ కార్యకర్తలే ఉండేవారు. కానీ ఓటమి తర్వాత పక్కన ఉండే కేడర్ సంఖ్య తగ్గుతూ వచ్చింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం వదులుకున్నందుకు హేళన చేసేవారు. ఇది చాలదన్నట్టు ఆ ఎన్నికల్లో నాపై నెగ్గిన తాటి వెంకటేశ్వర్లు సైతం బీఆర్ఎస్లో చేరారు. దీంతో 2019 ఎన్నికల్లో టికెట్ ఆయనకే కన్ఫర్మ్ అయింది. ఆ ఎన్నికల్లో గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు కూడా బీఆర్ఎస్లో చేరడంతో పార్టీలో నేను మూడో స్థానానికి పడిపోగా పలకరించే వారు కరువయ్యారు.
క్రమశిక్షణ.. సమయపాలన..
స్కౌట్స్లో పని చేయడం వల్ల చిన్నప్పటి నుంచి అలవడిన క్రమశిక్షణ, సమయపాలన నాకు అండగా నిలిచాయి. కష్టాలు ఎదురైనా నీరుగారిపోకుండా లక్ష్యం వైపు నడిచేలా దోహదం చేశాయి. దీంతో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి అశ్వారావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. ఒక వ్యక్తి లేదా సమాజం ఎదుగుదలలో విద్య ప్రాముఖ్యత తెలిసిన వాడిని కాబట్టే ఎమ్మెల్యే కోటాలో వచ్చిన రూ.10 కోట్ల నిధుల్లో రూ. 5 కోట్లు విద్య మీదనే ఖర్చు పెట్టాను. ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదా అని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నా. మా ప్రాంతంలో ఉద్యాన పంటలు ఎక్కువ. అందుకే విద్యా పరిమాణాలు ఉద్యాన రైతులకు చేరువ చేసేందుకు హార్టికల్చరల్ యూనివర్సిటీని అశ్వారావుపేటలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నా.
ఆచార్యా.. ఆదర్శం
విద్యార్థుల్లో స్ఫూర్తి కోసమే సూటు బూటు
విద్యార్థులకు ఆరంభంలోనే క్రమశిక్షణతో కూడిన విద్యాబుద్ధులు నేర్పిస్తే వారి జీవితాల్లో వెలుగు రేఖలు రావడంతో పాటు పేదరికం తొలగిపోతుంది అంటున్నారు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. గతంలో ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా పని చేసిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో తన గళం వినిపిస్తున్నారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థిగా, ఉపాధ్యాయుడిగా, ఎమ్మెల్యేగా అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
–సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

ఎమ్మెల్యే సార్ !

ఎమ్మెల్యే సార్ !

ఎమ్మెల్యే సార్ !