
ఏబీసీ.. తాళం వేసి ఏడాది..
దాడులతో భయాందోళన..
● కొత్తగూడెం కార్పొరేషన్లో వీధి కుక్కల స్వైర విహారం ● పిల్లలు, వృద్ధులపై అధికమవుతున్న దాడులు ● భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు ● పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
కొత్తగూడెంఅర్బన్: కుక్కల సంఖ్యను నియంత్రించేందుకు రూ.లక్షల వ్యయంతో జిల్లా కేంద్రంలో నిర్మించిన యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) సెంటర్ ప్రస్తుతంనిరుపయోగంగా మారింది. అధికారు ల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంతో ఏడాది కాలంగా మూతబడి ఉంది. ప్రస్తుతం వర్షా కాలం కావడంతో కుక్కలు స్వైర విహారం చేస్తున్నా యి. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కుక్కకాటుకు గురైన వ్యక్తివర్షంలో తడిస్తే ప్రాణాపాయ స్థితి కి చేరే ప్రమాదం ఉంది. కానీ, కుక్కల నియంత్రణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ఎక్కువైన శునకాల సంచారం
కార్పొరేషన్ పరిధిలోని కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ డివిజన్లలో కుక్కల సంచారం ఎక్కువ గా ఉంది. ఆయా డివిజన్ల నుంచి అధికారులకు నిత్యం ఫిర్యాదు చేస్తున్నారు. అయినా కూడా అధికారులలో చలనం రావడం లేదు. కుక్కలు కరిచిన వారు ఘటనా స్థలం నుంచి నేరుగా గతంలో కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చి సంబంధిత అధికారులను నిలదీసిన ఘటనలున్నాయి. వర్షాకాలం కావడంతో పిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారు. పిల్లలు పాఠశాలలు, ట్యూ షన్లకు వెళ్లే సమయంలో కుటుంబ సభ్యులు వారి వెంట రక్షకులుగా వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
బిల్లులు చెల్లించకనే..
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రైటర్బస్తీ గొల్లగూడెంలో 2021లో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు. ఏడాదికాలంగా కాంట్రాక్టర్కు బిల్లులు రాకపోవడంతో మూసివేశారు. కాంట్రాక్టర్కు సుమారు రూ.6 లక్షల బిల్లు రావాల్సి ఉందని తెలిసింది. ఈ సెంటర్లో గోప్యంగా కుక్కలకు కుటుంబ నియంత్రణ వాక్సిన్లు వేసేవారు. కాగా, కుక్కలకు సెంటర్లో సరైన ఆహారం అందించడం లేదని గొడవలు కావడం, సెంటర్కు తెచ్చిన కుక్కలను ఎక్కడ పట్టుకున్నారో అక్కడే వదిలకుండా.. సెంటర్ పరిసరాల్లోనే వదిలడంతో స్థానికులు ఆందోళన చేసిన ఘటనలున్నాయి. బిల్లులకు తగ్గట్టుగా సెంటర్లో కుక్కల సంఖ్య లేకపోవడాన్ని పలువురు గమనించారు.
కొత్తగా పాల్వంచలో..
ప్రస్తుతం పాల్వంచ ప్రాంతంలో మరో ఏబీసీని నూ తనంగా నిర్మించారు. అయితే అక్కడకు కొత్తగూడెం, సుజాతనగర్, పాల్వంచ డివిజన్లలోని కుక్కలను పట్టి.. అక్కడే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కొత్తగూడెం, సుజాతనగర్లోని కుక్కలను పాల్వంచకు తీసుకెళ్లి, వ్యాక్సిన్ వేసి, తిరిగి వాటిని ఆయా ప్రాంతాలకు తీసుకురావాలంటే శ్రమతో కూడిన అంశం. అలా కాకుండా రెండు సెంటర్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎక్కడి వాటిని అక్కడే పట్టించి, వ్యాక్సిన్ వేస్తే బాగుంటుందని జంతు ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. ఆ రకంగా కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. లేదంటే ఏబీసీ సెంటర్లకు వెళ్లిన కుక్కలు తిరిగి అదే ప్రాంతానికి రాకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో కుక్కలు దాడులు చేయడం వల్ల గాయపడిన వారు, విషయం తెలుసుకున్న వారు భయాందోళన చెందుతున్నారు. కొత్తగూడెంలోని భజనమందిరం రోడ్డు, హనుమాన్బస్తీ, బూడిదగడ్డ, రామాటాకీస్ ఏరియా, రాజీవ్పార్కు ఏరియా, గొల్లగూడెం తదితర ప్రాంతాల్లో పగలు, రాత్రులు గుంపులు, గుంపులుగా కుక్కలు తిరుగుతున్నాయి. వాటి నుంచి రక్షణ కల్పించాలని స్థానిక ప్రజలు కార్పొరేషన్ అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు. ఇప్పటికై నా కార్పొరేషన్లో కుక్కల బెడదను తగ్గించేందుకు గానూ వాటిని పట్టి వ్యాక్సిన్ వేయాల్సిన అవసరముందని ప్రజలు పేర్కొంటున్నారు. అధికారులు ఇప్పటికై నా దృష్టిసారించి, కుక్కల సంఖ్య ప్రకారం బిల్లులు చెల్లించాలని, లేనిపక్షంలో కుక్కలను పట్టకున్నా.. పట్టినట్లు చూపి, లెక్కలు తారుమారు చేసే అవకాశాలు ఉంటాయని పలువురు ఆరోపిస్తున్నారు.