ఉద్రిక్తత నడుమ ముందుకు సాగిన యాత్ర తొలిరోజు ఆరు గ్రామాలలో పూర్తి టీడీపీ ప్రభుత్వ తీరుపై వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పీటా ఆగ్రహం
రైతు భరోసా పాదయాత్రకు
రేపల్లె: అడవులదీవి గ్రామం నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా పాదయాత్ర ప్రారంభమైన వెంటనే పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అడవులదీవి ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు మోహరించి పాదయాత్రకు అనుమతులు లేవంటూ వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్కృష్ణతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పాదయాత్రను నిలిపివేయాలని పోలీసులు పట్టుబడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతుల సమస్యలను తెలుసుకోవడానికి చేపట్టిన పాదయాత్రకు కూడా అనుమతులు కావాలా.. ప్రజల బాధలు వినడానికే వస్తే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం.. అని వైఎస్సార్ సీపీ నాయకులు నిలదీశారు. ప్రభుత్వ తీరుపై ప్రశ్నలు లేవనెత్తే కార్యక్రమాలన్నింటినీ అణచివేయాలనే ఉద్దేశంతోనే ఈ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా నాగ మోహన్కృష్ణ మాట్లాడుతూ రైతు కష్టాలను తెలుసుకోవడానికి చేపట్టిన పాదయాత్రను కూడా అడ్డుకోవడం చూస్తే చంద్రబాబు ప్రభుత్వానికి ఎంత భయంగా ఉందో తేలుతోందన్నారు. కరువు పరిస్థితులపై నిజాలు బయటపడకుండా చేయడానికే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్యల అంచుకు చేరుతున్నా వారి కోసం ఒక్క అడుగు కూడా వేయని ప్రభుత్వం తీరును ఖండించారు. రైతుల సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నాన్ని అడ్డుకోవడం దారుణమని ధ్వజమెత్తారు. పోలీసులు అనుమతులు లేవంటూ పదేపదే హెచ్చరికలు జారీ చేయడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసులకు, పార్టీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు డీజే బాక్స్ను సీజ్ చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.
ఎట్టకేలకు ముందుకు...
వైఎస్సార్ సీపీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్రను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పరిస్థితి నియంత్రణలోకి వచ్చిన తర్వాత పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మోహన్కృష్ణ ఆధ్వర్యంలో రైతు భరోసా పాదయాత్ర ముందుకు సాగింది. అడవులదీవి నుంచి ప్రారంభమైన పాదయాత్ర గరువుపాలెం, కూచినపూడి గ్రామాల మీదగా బొర్రావారిపాలెం, కేసనవారిపాలెం, అచ్యుతపురం, పెదమట్లపూడి మీదగా చినమట్లపూడికి చేరుకుంది. చినమట్లపూడిలో రాత్రికి బస చేశారు. పాదయాత్రకు పార్టీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మేరుగ చందన్నాగ్, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


