● ఏపీ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డెప్యూటీ డైరెక్టర్ అనిల్ కుమార్ ● చలపతిలో 2026–27 విద్యా సంవత్సరానికి ఓరియంటేషన్
గుంటూరు రూరల్: ఫార్మసీ రంగంలో విద్యార్థులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, ఔషధ నాణ్యత, భద్రత, తయారీ, పంపిణీ నియంత్రణ వ్యవస్థల్లో ఫార్మసిస్టుల పాత్ర అత్యంత కీలకమని ఏపీ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ కె.అనిల్ కుమార్ పేర్కొన్నారు. నగర శివారుల్లోని లాంలో చలపతి ఫార్మసీ కళాశాలలో బుధవారం 2026–27 విద్యా సంవత్సరానికి బీ ఫార్మసీ, ఫార్మా డీ ఎం.ఫార్మసీ తరగతుల ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఔషధం తయారీ దశ నుంచి రోగికి చేరే వరకు అనేక నాణ్యతా ప్రమాణాలు, నియంత్రణ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, అందువల్ల విద్యార్థులు డ్రగ్ రెగ్యులేషన్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అస్యూరెన్స్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ వంటి అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవాలని సూచించారు. గవర్నమెంట్ ఉమెన్న్స్ కాలేజ్ రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ బి.వరలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో కళాశాల దశ అత్యంత కీలకమైనదని, ఈ దశలో సంపాదించే జ్ఞానంతో పాటు వ్యక్తిత్వం, ఆలోచనా విధానం విలువలు భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ డి.లక్ష్మణ్ మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులు భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యంతో నేరుగా సంబంధం కలిగిన బాధ్యతాయుతమైన వత్తిలోకి ప్రవేశించబోతున్నారన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజినల్ ఆఫీస్, గుంటూరు సీనియర్ మేనేజర్ కిరణ్ విక్టర్, చలపతి యూనివర్సిటీ ప్రో–చాన్సలర్ వై.సుజిత్కుమార్, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ నాదెండ్ల రామారావు మాట్లాడారు.


