వేడుకగా ఏఎన్యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కళకళలాడిన విశ్వవిద్యాలయ ప్రాంగణం
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వాములు కావాలని వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవాలలో భాగంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం బుధవారం వర్సిటీ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. దేశ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వర్సిటీ ప్రాంగణం సందడిగా మారింది. పాత మిత్రులను కలుసుకుని, నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఆనందోత్సాహాలతో గడిపారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ జస్టిస్ జి. రామకృష్ణ ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య, పరిశోధన, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమానికి పూర్వ విద్యార్థులు సహకారం అందించాలన్నారు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ టి. జనార్దన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం విద్యార్థులకు కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా జీవితానికి అవసరమైన ఎన్నో విలువలను అందించిందన్నారు. రాష్ట్ర సీఐడీ డీజీపీ డాక్టర్ ఎస్. రవిశంకర్ అయ్యనార్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్పర్సన్ ప్రొఫెసర్ కె. రత్న షీలామణి, కార్యదర్శి ప్రొఫెసర్ బి. తిరుపతిరావు, మాజీ డీజీపీ బండి మరియాకుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎం. ప్రేమ్కుమార్, వర్సిటీ రెక్టర్ ప్రొఫెసర్ ఆర్. శివరామ్ ప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం తదితరులు ప్రసంగించారు.


