తాడేపల్లి రూరల్: తాడేపల్లిలోని శాఖా గ్రంథాలయాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భీమనేని వందనాదేవి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రంథాలయం పనితీరు, అందుబాటులో ఉన్న పుస్తకాలు, సౌకర్యాలపై పాఠకులతో ఆరా తీశారు. పాఠకులకు అవసరమైన పుస్తకాలను రీడర్స్ ఆన్ డిమాండ్ రిజిస్టర్లో నమోదు చేయాలని గ్రంథాలయ అధికారి షేక్ నాగుర్ బాషాకు సూచించారు. గ్రంథాలయానికి ఎక్కువ మంది పాఠకులు వచ్చేటట్లు, ఎక్కువ మంది సభ్యత్వం తీసుకునేటట్లు, చదువరులను ప్రోత్సహించాలని నాగుర్ బాషాకు ఆదేశించారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ స్వర్ణోత్సవాల సందర్భంగా 1976 నుంచి 2026 వరకు విశ్వవిద్యాలయం సాగించిన 50 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా ఫొటో ఎగ్జిబిషన్న్ను వర్సిటీ డైక్మన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. ఏఎన్యూలో మంగళవారం ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ను వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కంచర్ల గంగాధరరావు, రెక్టార్ ప్రొఫెసర్ ఆర్ శివరాంప్రసాద్, ప్రొఫెసర్ జి సింహాచలం తదితరులు ప్రారంభించారు. వర్సిటీ ఆవిర్భావం నుంచి నేటి వరకూ సాధించిన ప్రగతి, విద్యా, పరిశోధన, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో నమోదైన విజయాలు, ప్రముఖుల సందర్శనలు, ముఖ్యమైన కార్యక్రమాలు, విశ్వవిద్యాలయ అభివృద్ధికి సంబంధించిన కీలక ఘట్టాలను అరుదైన ఛాయాచిత్రాల రూపంలో ప్రదర్శనలో పొందుపరిచారు. పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది, ప్రస్తుత విద్యార్థులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ తేజోమూర్తి, ఫొటోగ్రాఫర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అమరావతి: ప్రసిద్ధ శైవ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో మూడు రోజులపాటు నిర్వహించే పవిత్రోత్సవాలను అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా మంగళవారం ప్రారంభించారు. మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి ఆలయ అవరణను శుద్ధిచేసి భక్తులకు ఎనిమిది గంటలకు స్వామివారి అభిషేకం అనంతరం దర్శనాన్ని కల్పించారు. అనంతరం అర్చకులు ప్రధాన, ఉపాలయాల మూర్తులకు స్నపనాభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వేదపండితులు నవగ్రహామండ పారాధనతో దేవతలను అవాహన చేసి అగ్నిమదనంతో దీక్షాహోమాలు నిర్వహించారు. గురువారం పవిత్రోత్సవాలలో మండప పూజలు, దీక్షాహోమాలు, మూలమంత్ర హవన ములు, రుద్రహోమం, పవిత్రారోపణం, చండీహోమం నిర్వహిస్తామని ఆలయఅర్చకులు తెలిపారు.
మంగళగిరి రూరల్: శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని హరేకృష్ణ గోకుల క్షేత్రం ఉపాధ్యక్షుడు విలాస దాస తెలిపారు. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలోని అక్షయపాత్ర ఆవరణలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామంలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో ఈనెల 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రోజంతా ప్రత్యేక దర్శనం, సంకల్ప అర్చన, మహాఅ భిషేకం, హరినామ సంకీర్తనం, భజనలు, కీర్తనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఉట్టి ఉత్సవ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి ప్రత్యేక అభిషేకం ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలిపారు.


