గుంటూరు ఎడ్యుకేషన్: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు, నిబంధనల సడలింపు డిమాండ్లతో ఈనెల 3న చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం చలో విజయవాడ విజయవంతం కోరుతూ మార్కెట్ సెంటర్లోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి ఉపాధ్యాయుల బైక్ ర్యాలీని ప్రారంభించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టెట్ను రద్దు, నిబంధనల సవరణ కోరుతూ జిల్లా, తాలూకా కేంద్రాల్లో నిరసనల ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలియజేసినా, ఎటువంటి స్పందన లేదన్నారు. ఉపాధ్యాయును తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న ప్రత్యేక్ టెట్కు వ్యతిరేకంగా చలో విజయవాడకు పిలుపు ఇచ్చినట్లు చెప్పారు. ఉపాధ్యాయ వర్గం పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వం కళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. తమిళనాడు రాష్ట్రం ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అవసరం లేదని తీర్మానం చేసిన విషయం గుర్తు చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణ కమిటీ చైర్మన్, పీడీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం.హనుమంతరావు మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటి ఉద్యోగుల జీవితాల్లో చీకటి రోజు అని, పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి సీపీఎస్ అమల్లోకి తెచ్చిన రోజు అన్నారు. అధికారంలోకి రాకముందు సీపీఎస్ రద్దు చేస్తామని, అధికారంలోకి వచ్చాక హామీని తుంగలో తొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం సీపీఎస్ రద్దుతో పాటు ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ పరీక్ష రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ర్యాలీలో రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమ కుమారి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజ శేఖరరావు, ఎం.కళాధర్, జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శులు జి.ఆదినారాయణ, గోవిందు, ప్రసాదు, రంగారావు, కోటిరెడ్డి, ప్రేమ్ కుమార్, వినోద్ పాల్గొన్నారు.


