డీఈఓ సలీమ్ బాషా
గుంటూరు ఎడ్యుకేషన్: ఇన్స్పైర్ మానక్ వేదికను ఉపయోగించుకుని అన్వేషణాత్మక ఆలోచనలు కలిగిన విద్యార్థులను ఇన్స్పైర్ చేసి బాల శాస్త్రవేత్తలుగా ఎదిగే విధంగా ప్రోత్సహించాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీమ్ బాషా ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్ష భవన్లో ఇన్స్పైర్ మానక్పై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశానికి జిల్లా సైన్స్ అధికారి షేక్ గౌసుల్ మీరా అధ్యక్షత వహించారు. డీఈఓ మాట్లాడుతూ ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో గట్టి ఆలోచనలు ఉంటాయని, వాటికి పదును పెడితే బాల శాస్త్రవేత్తలు తయారవుతారని అన్నారు. స్థానిక సమస్యలకు పరిష్కారాన్ని చూపే వినూత్నమైన ప్రాజెక్టులను నామినేషన్లలో చోటు కల్పించాలని కోరారు. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మూడు, ఉన్నత పాఠశాలలు, హైస్కూల్ ప్లస్ పాఠశాలల నుంచి ఐదు నామినేషన్లు తప్పనిసరిగా సమర్పించాలన్నారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వినూత్న ప్రాజెక్టులనే ఎంపిక చేసి ప్రాజెక్టు తయారీకి రూ.10 వేలు చొప్పున అవార్డును ప్రకటిస్తారన్నారు. గుంటూరు ఉప విద్యాశాఖాధికారి జి.ఏసురత్నం మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం విద్యార్థుల్లో శాసీ్త్రయ విజ్ఞానాన్ని పెంపొందించాలని అన్నారు. కార్యక్రమంలో రీసోర్సు పర్సన్లు అప్పారావు, శివ శంకరరావు, మల్లికార్జునరావు, గంగాధర్, వెంకటేశ్వరరావు, భాస్కరరావు, గుంటూరు, తెనాలి డివిజన్ల నుంచి 200 మంది సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


