ఎస్పీకి సమస్యలు ఏకరువు పెట్టిన బాధితులు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చిన ఎస్పీ
బాపట్లటౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 54 మంది బాధితులు హాజరై తమ సమస్యలను నేరుగా ఎస్పీ, అడిషనల్ ఎస్పీకి విన్నవించుకున్నారు. బాధితుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ బి.ఉమామహేశ్వర్, అడిషనల్ ఎస్పీ ఎల్. సుధాకర్ వెంటనే సంబంధిత సీఐ, ఎస్ఐలతో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని బాధితులు వాపోతున్నారు. అర్జీలు స్వీకరించిన వారిలో రేపల్లె డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, ఎస్ఐ లక్ష్మీరాజ్యం పాల్గొన్నారు.


