జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్
బాపట్ల: నీట్ పీజీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. పరీక్ష పర్యవేక్షణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. సమగ్ర ప్రణాళిక, నిబద్ధతతో విధులు నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. 30వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. వేటపాలెంలోని సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలలోని రెండు కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 496 మంది అభ్యర్థులు హాజరు అవుతారన్నారు. పరీక్ష కేంద్రాలకు జిల్లా నోడల్ అధికారిగా చీరాల ఆర్డీవో నరసింహారావును నియమించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం నుంచి ఇద్దరు సీనియర్ అధికారులు పరీక్షను పర్యవేక్షిస్తారని చెప్పారు. చీరాల ఆర్డీవో నరసింహారావు, సీపీడీసీఎల్ ఎస్ఈ ఆంజనేయులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్చార్జి అధికారి సోమల నాయక్, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


