గుంటూరు మెడికల్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్) అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం నాడు విజయవాడ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన ర్యాలీ సభ జరగనుందని ఏపీ ఎన్జీజీవోస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లాస్థాయిలో ఎన్జీవో హోంలో అన్ని సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ, సన్నాక సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఘంటసాల శ్రీనివాసరావు, సెక్రెటరీ శ్యామ్ సుందర్ శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.కె నాగుల్ షరీఫ్లు మాట్లాడుతూ ఏపీసీపీఎస్ఈఏ నిర్వహించ తలపెట్టిన సెప్టెంబర్ 1 ర్యాలీ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీసీపీఎస్ఈఏ గుంటూరు జిల్లా తాత్కాలిక అధ్యక్షుడు కొమ్మనబోయిన సుకుమార్, సెక్రటరీ రవితేజ మాట్లాడుతూ ఐక్య ఉద్యమాలే ఫలితాలనిస్తాయని పాత పెన్షన్ విధానం కోసం నిర్వహిస్తున్న ఈ ధర్నా కార్యక్రమానికి అని సంఘాలు మద్దతు పలకాలని, వేలాది సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గుంటూరు నగర అధ్యక్షుడు సీహెచ్ కళ్యాణ్ కుమార్, సిటీ కార్యదర్శి జీవీ కోటేశ్వరరావు మాట్లాడుతూ ధర్నాకు తమ శాఖల కార్యకర్తలు వేలాదిగా పాల్గొంటారని తెలిపారు. సీనియర్ సీపీ ఉద్యమ నాయకులు తిరుమలరెడ్డి, దయాసాగర్, ఎస్టీయూ గుంటూరు జిల్లా అధ్యక్షుడు బాజీ, యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కాలిద్, ఏపీసీపీఎస్ఈఏ పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఉబేదుల్లా బేగ్ మాట్లాడారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీజీవోస్, ఏపీజేఏసీ సభ్య సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఇతర సంఘాల నాయకులు, నాయకులు కిషోర్, చంద్రమోహన్, రామచంద్రరావు పాల్గొన్నారు.


