మాజీ మంత్రి విడదల రజిని మృతుల కుటుంబాలకు పరామర్శ
చిలకలూరిపేటటౌన్: ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి తగిన సహాయం అందించాలని మాజీ మంత్రి విడదల రజిని కోరారు. చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ప్రమాద మృతుల భౌతికకాయాలను ఆమె సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. వేలూరు గ్రామానికి చెందిన ఏడుగురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రజిని మీడియాతో మాట్లాడుతూ ప్రమాదంపై వేగంగా దర్యాప్తు చేసి భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలను పరామర్శించిన వారిలో పల్నాడు జిల్లా ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి, షేక్ జాన్సైదా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన నాయకులు మండలనేని చరణ్తేజ్, తోటా రాజా రమేష్, నిడ్క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, సీపీఐ నాయకులు తాళ్లూరి బాబూరావు, షేక్ సుభాని, చెరుకుపల్లి నిర్మల తదితరులు ఉన్నారు.


