రేపల్లె: ఎల్నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ అన్నారు. మండలంలోని పేటేరు గ్రామంలో వ్యవసాయ శాఖ, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఎల్నినో ప్రభావం, కార్యాచరణ ప్రణాళికపై రైతులకు శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డెల్టా ప్రాంతంలో అధికంగా వరి సాగు జరుగుతున్నందున నీటి పొదుపు, సాగునీటి సమర్థ వినియోగం, పంట రక్షణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.రైతులు తమ సందేహాలను శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకురాగా, వారు ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల్లో పంటల రక్షణ, నీటి నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్రంగా వివరించారు.కార్యక్రమంలో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు డాక్టర్ జి.రామచంద్రరావు, విస్తరణ విభాగం డైరెక్టర్ డాక్టర్ వీవీఎస్ దుర్గాప్రసాద్, పరిశోధన విభాగం డైరెక్టర్ డాక్టర్ కె.అచ్యుతరాజు, డాట్ కోఆర్డినేటర్ డాక్టర్ కృష్ణవేణి, ఏఆర్ఎస్ హెడ్ డాక్టర్ మాధవి మధువాణి, డాక్టర్ మృదుల, డాక్టర్ వాసుదేవరావు, డాక్టర్ సందీప్రాజు, డాక్టర్ హరిత, ఏడీఏ వి.రమేష్బాబు, ఏఓ మహేష్బాబు, ఏఈఓలు సుమంత్, పావని, వీఏఏ రాయల్బాబు, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్, ఏపీసీఎన్ఎఫ్ డీపీఎం మధుమోహన్, ఏపీసీఎన్ఎఫ్ వినయ్ పాల్గొన్నారు.
చెరుకుపల్లి: ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేసే రైతులు తక్కువ కాల పరిమితి గల విత్తనాలను ఎంపిక చేసుకోవాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ అన్నారు. మండలంలోని గూడవల్లి గ్రామంలో శుక్రవారం మండల వ్యవసాయ అధికారి ఎండీ ఫరూఖ్ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులతో కలసి వరి నారుమడులు, నాటిన పొలాలను ఆయన పరిశీలించారు. గూడవల్లి గ్రామంలో ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో వరి సాగుపై రైతులకు అవగాహన కల్పించారు.
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ
విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ సత్యనారాయణ


