చందోలు(కర్లపాలెం): సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం బాపట్ల జిల్లా చందోలులో ఉన్న బగళాముఖి అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఈవో నరసింహమూర్తి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. ఆషాఢ మాసం ముగింపు పూజలలో భాగంగా నిర్వహించిన పూర్ణాహుతిలో ఎన్వీ రమణ పాల్గొన్నారు. హోమంలో కూడా పాల్గొని, పూజలు నిర్వహించారు. అనంతరం ఈవోతోపాటు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చక్రధర్ రెడ్డి ఆయన్ను సన్మానించారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఎస్ఐ మాధవరావు, దేవదాయ శాఖ జిల్లా మేనేజర్ ఎం.నాగయ్య పాల్గొన్నారు.
వీరాంజనేయుని సేవలో...
పొన్నూరు: పట్టణంలోని వీరాంజనేయస్వామి వారిని శుక్రవారం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత స్వామి వారిని ఆయన దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ్ధప్రసాదం స్వీకరించారు. ఈవో ఎ. శ్రీనివాసరావు, అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
చిలకలూరిపేట టౌన్: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు నవోదయ విద్యాలయ సమితి గడువు పెంచింది. జేఎన్వీఎస్టీ 2027–28 విద్యా సంవత్సరం ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఆగస్టు 10 వ తేదీ వరకు పొడిగించిందని మద్దిరాల పీఎంశ్రీ జవహర్ నవోదయ విదాల్యయం ప్రిన్సిపాల్ పంతంగి శ్రీనివారావు తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 11, 12 తేదీల్లో దరఖాస్తుల్లో సవరణలు చేసుకునేందుకు ప్రత్యేక అవకాశం కల్పించిందని వెల్లడించారు. మాధ్యమం, కేటగిరీ, లింగం, ప్రాంతం, దివ్యాంగుల విభాగానికి సంబంధించిన వివరాలను మాత్రమే ఈ సమయంలో మార్చుకోవచ్చన్నారు.
అమరావతి: ప్రసిద్ధ అమరావతి అమరేశ్వర ఆలయంలో శుక్రవారం ఆడికృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారికి భక్తుల సమక్షంలో అర్చకుడు శంకరమంచి రాజేష్ శర్మ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. అనంతరం స్వామి వారికి విశేషాలంకారం చేసి, భక్తులకు దర్శనం కల్పించారు. తీర్థప్రసాదాలు అందజేశారు. పూజలలో పలు గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఈ ఏడాది జూన్లో నిర్వహించిన ఫార్మా–డీ, ఏప్రిల్లో నిర్వహించిన నానో టెక్నాలజీ పరీక్ష ఫలితాలను పరీక్షల నియంత్రణాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం విడుదల చేశారు. ఎంఎస్సీ నానో టెక్నాలజీ 5–7 సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 26 మంది హాజరు కాగా, వారిలో 25 మంది ఉత్తీర్ణులయ్యార తెలిపారు. ఫార్మా–డీ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 232 మంది రాశారన్నారు. వారిలో 228 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చన్నారు.
దూరవిద్య రీవాల్యూయేషన్
ఫలితాలు విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలనీ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగిన దూరవిద్య యూజీ, పీజీ పరీక్షల రీవాల్యూయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారి వెబ్సైట్లో తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.


