మానవ అక్రమ రవాణాను అరికట్టాలి
బాపట్ల: మానవ అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా షాడోస్, వెట్టి విమోచన కోయిలేషన్, సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్, మానవత స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన వాల్పోస్టర్లు, ఫ్లెక్సీలను జేసీ గురువారం ఆవిష్కరించారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధించిన నేపథ్యంలో గుడ్డ సంచులను స్వచ్ఛంద సంస్థలు తయారు చేయడం అభినందనీయమన్నారు. డీసీపీఓ పురుషోత్తం, షాడోస్ ఎ.రాజ సాల్మన్, డాక్టర్ ఐ.శ్రీనివాసరావు, భాగ్యలక్ష్మి, అలేఖ్య, పావని, గురజాల శ్రీనివాసరావు, వెంకట్రావు, డీబీఆర్సీ భగవాన్ దాసు, శ్రీలేఖ, డీవీఎంసీ సభ్యులు ప్రసాద్, రోజ్ ఎన్జీవో ప్రసాద్, పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే పరమావధిగా భావించాలి
బాపట్ల: రైతుల సంక్షేమమే పరమావధిగా భావించి అధికారులు పనిచేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ తెలిపారు. రైతుల సంక్షేమంపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. అధిక లాభాలు వచ్చే పంటలవైపు రైతులు మళ్లేలా అవగాహన కల్పించాలన్నారు. ఎల్నినో ప్రభావంతో ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్ళించేలా కృషి చేయాలన్నారు. జిల్లాలోని 8 సంఘాలను నాబార్డు గుర్తించిందన్నారు. ఈ సందర్భంగా రైతులు పలు అంశాలను అధికారుల దృష్టికి తెచ్చారు. రైతు ఉత్పత్తి కేంద్రాలకు లైసెన్సులు అనుమతులు ఇవ్వాలని, రైతుల వద్ద ధాన్యం నిల్వ చేసుకునే అవకాశాలు కల్పించాలి, ధాన్యం కొనుగోలుకు అనుమతులు ఇవ్వాలని పలువురు కోరారు.


