బాపట్ల: సముద్రంలో వేట సాగించిన తరువాత పడవలను లంగరు వేసుకునేందుకు నిర్మించే జెట్టీ నిర్మాణం ఇప్పట్లో నెరవేరేలా కనిపించటంలేదు. చైన్నె నుంచి నిపుణుల బృందం దాన్వాయ్పేట, కృపానగర్ మధ్యలో జెట్టీ నిర్మాణానికి అనుకూలమైన స్థలంగా ప్రతిపాదించినప్పటికి కార్యరూపం దాల్చలేదు. జెట్టీ లేకపోవటంతో వేటకువెళ్లి వచ్చిన తరువాత పడవలు నిలుపుకొనేందుకు రెండు, మూడు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
నియోజకవర్గంలో పరిస్థితి ఇదీ..
బాపట్ల నియోజకవర్గంలో సూర్యలంక, రామానగర్, ముత్తాయిపాలెం, విజయలక్ష్మి, దాన్వాయ్పేట, కృపానగర్, అడవిపల్లిపాలెం, రామచంద్రపురం, తుమ్మలపాలెం ప్రాంతాలకు చెందిన వారివద్ద 250 పడవలు వరకు ఉన్నాయి. వీటిపై రెండువేల కుటుంబాల వరకు ఆధారపడి జీవిస్తుంటారు. సూర్యలంక, రామానగర్, ముత్తాయిపాలెంకు చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటసాగించి సముద్రం వద్ద ఉన్న పొరుగులో నుంచి వెదుళ్ళపల్లి డ్రైన్లోకి పడవవలను తెచ్చిపెట్టుకుంటారు. సుమారు రాకపోకలకు అదనంగా ఐదు కిలోమీటర్లు మేర ఆయిల్ వృథా ఖర్చుగా మారింది. అదేవిధంగా ధాన్వాయ్పేట, కృపానగర్, అడవిపల్లిపాలెం, రామచంద్రపురానికి చెందిన మత్స్యకారులు వేట పూర్తి చేసుకున్న తరువాత ఈపూరుపాలెం డ్రైన్లో పడవలను తెచ్చిపెట్టుకుంటున్నారు. ఈవిధంగా డ్రైన్లో పడవలు పెట్టుకోవటం వలన తుఫాన్లు వచ్చినప్పుడు పడవులు ఆటుపోటులకు తీవ్ర దెబ్బతింటున్నాయి. జెట్టీ నిర్మాణం జరిగితే పడవలకు రక్షణగా ఉంటుందని మత్స్యకారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
లంగరు వేసేందుకు ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులు


