నరసరావుపేట: తెలంగాణ రాష్ట్రం నుంచి పల్నాడు జిల్లాకు ధాన్యం రాకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ మిల్లర్లు అందరూ జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని కోరారు. ఈ మేరకు గురజాల, మాచర్ల మండలాల రైతులు వద్ద నుంచి ఫిర్యాదులు వచ్చాయని, వీటిని విచారించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2025–26కు సంబంధించి రబీలో 51 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, మిల్లర్లు అందరూ బ్యాంకు గ్యారెంటీలు అందజేయాలని, కావాల్సిన గోనెసంచులు, రవాణా వాహనాలకు జీపీఎస్ అమర్చి సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌరసఫరాల శాఖ అధికారి జీవీ ప్రసాదు, మిల్లర్ల అసోసియేషన్ నాయకులు ఊర భాస్కరరావు పాల్గొన్నారు.


