పదో తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటుపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం
కొల్లూరు: పదో తరగతి పరీక్షలకు పరీక్ష కేంద్రాల కేటాయింపులో ప్రైవేటు పాఠశాలకు పట్టం కట్టడం విమర్శలపాలైంది. పక్కా భవనాలు.. విశాలమైన తరగతి గడులు.. విద్యార్థులకు వసతులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు విద్యాశాఖాధికారులు మొండిచేయి చూపారు. ప్రైవేటు పాఠశాలలో కేంద్రం ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొల్లూరులో ఎప్పటి నుంచో పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ప్రభుత్వ బాలుర, బాలికోన్నత పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది మాత్రం విద్యాశాఖాధికారులు వీటిని రద్దు చేశారు. కొల్లూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో కేంద్రం ఏర్పాటుకు మొగ్గుచూపడంపై విద్యావేత్తలతోపాటు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలైన బాలుర, బాలికోన్నత పాఠశాలల్లో విశాలమైన 20 గదులు పరీక్షల నిర్వహణకు అందుబాటులో ఉన్నాయి. ఇరుకై న చిన్న తరగతి గదులతో ఉన్న ప్రైవేటు పాఠశాలను కేంద్రంగా ఎంపిక చేయడంతో అధికారుల తీరు విమర్శలపాలైంది. మండలంలో గతంలో కొల్లూరు బాలుర, బాలికోన్నత, అనంతవరం జిల్లా పరిషత్తు పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణ సమర్థంగా నిర్వహించేవారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో కేంద్రాలను కుదింపులో భాగంగా అరకొర సౌకర్యాలున్న ప్రైవేటు పాఠశాలలకు పట్టం కట్టడం విద్యార్థుల పాలిట శాపంగా మారినుందన్న ఆరోపణలు తల్లిదండ్రుల నుంచి వెలువడుతున్నాయి. కేంద్రాల మార్పు వ్యవహారం చివరి వరకు మూడో కంటికి తెలియకుండా విద్యాశాఖాధికారులు ఏకపక్ష నిర్ణయం చేయడంపై మండిపడుతున్నారు. సుమారు 350 మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పరీక్షలు కొల్లూరు కేంద్రంలో రాయాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలల ప్రదానోపాధ్యాయులు, స్థానిక విద్యాశాఖాధికారుల అభిప్రాయాలను సైతం తీసుకోకుండానే ఉన్నతాధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో కేంద్రాలను రద్దు చేయడంపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.


